
2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి ఆరుకు తగ్గినట్లు వెల్లడించారు. నక్సల్ రహిత భారత్ను నిర్మించే దిశగా మనం మరో మైలు రాయిని చేరుకున్నామని పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్ అడవుల్లో గత కొన్ని రోజులుగా వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కాల్పుల్లో అనేక మంది మావోలు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతపై అమిత్ షా తాజాగా స్పందించారు.
దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని.. ఇందులో భాగంగా సురక్షిత భారత్ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు.
“నేడు భారత్లో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి ఆరుకు తగ్గాయి. తద్వారా కొత్త మైలురాయిని సాధించాం. మోదీ ప్రభుత్వం నక్సలిజం పట్ల కఠినమైన విధానాన్ని అవలంభిస్తోంది. మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సురక్షిత భారత్ను నిర్మించడానికి కృషి చేస్తున్నాము. 2026 మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం” అని అమిత్ షా ప్రకటించారు.
హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికల ప్రకార దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం 2015లో ఇవి 35 ఉండగా, 2018 నాటికి 30కి తగ్గాయి. 2021నాటికి 25కు వచ్చాయి. తాజాగా వాటి సంఖ్య 6కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను సమీక్షించేందుకు అమిత్ షా ఈనెల 4, 5 తేదీల్లో ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కార్యకలాపాలను సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం షా ఏప్రిల్ 7, 8 తేదీల్లో జమ్ముకశ్మీర్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు సదరు వర్గాలను ఊటంకిస్తూ పీటీఐ నివేదించింది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు