అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే బాంబు దాడులే

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే బాంబు దాడులే
 
* ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
 
తమతో అణు ఒప్పందం చేసుకోకుంటే బాంబు దాడులు తప్పవని ఇరాన్‌‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు, అధిక సుంకాల తప్పవని స్పష్టం చేశారు. ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ అధికారులు ఈ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారు కానీ ఎటువంటి పురోగతి లేదని తెలిపారు.
 
 “ఒక వేళ ఒప్పందానికి వాళ్లు రాకుంటే.. బాంబులు వేస్తాం.. అంతేకాదు, నాలుగేళ్ల కిందట మాదిరిగా భారీగా టారిఫ్‌లు విధించక తప్పదు” అని ట్రంప్ బెదిరింపులకు దిగారు. అమెరికా, ఇరాన్ మధ్య 2015లో జరిగిన అణు ఒప్పందం నుంచి విబేధాలతో మొదటిసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ 2018లో వైదొలగారు.
 
అనంతరం టెహ్రాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ఈ ఒప్పందం కోసం ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి ఇరాన్‌ అణు కార్యకలాపాలను నియంత్రించేందుకు ట్రంప్ స్వరం పెంచారు. కానీ, ఇరాన్ సైతం ట్రంప్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటోంది.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకారం కొత్త అణు ఒప్పందానికి అంగీకరించాలని కోరుతూ ట్రంప్ రాసిన లేఖకు ఓమన్ ద్వారా తమ స్పందన పంపినట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. కాగా, ఇరాన్ రహస్యంగా అణ్వాయుధ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నదని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. 
 
పౌర అణు కార్యకలాపాలకు అవసరమైన దానికంటే అధిక స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తోందని విమర్శిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది. తాము కేవలం పౌర అణు కార్యకలాపాల కోసమే యురేనియం వినియోగిస్తున్నామని చెబుతోంది.  ఒకవేళ, అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే యురేనియం శుద్ధిపై పరిమితులు, పరిమితికి మించిన అణు రియాక్టర్లు మూసివేయడం వంటివి అమల్లోకి వస్తాయి. 
 
ఇరాన్ తన యురేనియం శుధ్దిని 3.67 శాతానికి పరిమితం చేయాల్సి ఉంటుంది. అలాగే,ఇరాన్ అణు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు కూడా అనుమతి లభిస్తుంది.

మరోవంక, ఉక్రెయిన్ తో యుద్దాన్ని ముగించని పక్షంలో రష్యా ఆయిల్ పై అదనపు సుంకాలను విధిస్తామని ట్రంప్ పుతిన్ ను హెచ్చరించారు. “నేను, రష్యా కలిసి ఉక్రెయిన్ లో రక్తపాతాన్ని ఆపివేయలేని పక్షంలో రష్యాదే పొరపాటు అవుతుంది. రష్యా నుండి వచ్చే మొత్తం చమురుపై రెండో సుంకాలు విధిస్తాను” అని స్పష్టం చేశారు.