మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ లలో ఎఎఫ్ఎస్‌పీఏ

మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ లలో ఎఎఫ్ఎస్‌పీఏ

జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ నివ్వురుగప్పిన నిప్పులా మారింది. ఈ నేపథ్యంలో మణిపూర్‌తోపాటు ఆ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో సైతం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (ఎఎఫ్ఎస్‌పీఏ)ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. 

ఈశాన్య రాష్ట్రాల్లోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆదివారం న్యూఢిల్లీలో కేంద్రం సమీక్ష నిర్వహించింది. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మణిపూర్‌ లోయలో పలు జిల్లాల్లోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎఎఫ్ఎస్‌పీఏ విధించినట్లు స్పష్టం చేసింది. ఇది 2025, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. 

నాగాలాండ్‌లోని ఎనిమిది జిల్లాలతోపాటు అదనంగా అయిదు జిల్లాల్లోని 21 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని వివరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరపి, చాంగ్‌లాంగ్, లాంగ్‌డింగ్ జిల్లాలతోపాటు నామ్‌సాయి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొంది.

2023, మే మాసంలో మణిపూర్‌లోని మైయితి, కూకీ అనే రెండు జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో దాదాపు 250 మందికిపైగా మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాగే వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలి పోయారు. అయితే ఆ రాష్ట్రంలో ఎన్ బిరేన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 

 
ఈ ఘర్షణల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు.. బిరేన్ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకొన్నాయి. అయినా బీజేపీకి తగినంత బలంగా ఉండడంతో ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం వరకు కొనసాగింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో బిరేన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.