దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ తర్వాత కోల్‌కతా

దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ తర్వాత కోల్‌కతా
దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి దేశంలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్‌ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్‌ మీటర్‌కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇది ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చాలా ఎక్కువగా. 
 
అయితే, ఢిల్లీలో గాలి నాణ్యత గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నది. గతేడాది ఇదే సమయంలో 2023-24 శీతాకాలంలో పీఎం2.5 స్థాయి క్యూబిక్‌ మీటర్‌కు 189 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం దేశంలో రెండో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో పీఎం 2.5 సగటు స్థాయి క్యూబిక్‌ మీటర్‌కు 65 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఢిల్లీతో పోలిస్తే భారీగా తక్కువ ఉన్నది. 
 
సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్ఈ) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముంబయి, బెంగళూరు, కోల్‌కతాలో కాలుష్యం గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిందని, చెన్నై, హైదరాబాద్‌లో అలాగే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌లో పీఎం 2.5 సగటున క్యూబిక్‌ మీటర్‌కు 52 మైక్రోగ్రాములు, ముంబయిలో 50, బెంగళూరులో 37, చెన్నైలో 36 మైక్రోగ్రాములు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది.
 
కాగా, ఢిల్లీలో కాలుష్యం తగ్గినప్పటికీ పరిస్థితి తీవ్రంగానే ఉందని డేటా పేర్కొంది. కాలుష్యం ఇప్పటికీ ఆరోగ్య ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పీఎం 2.5 స్థాయి క్యూబిక్‌ మీటర్‌కు 15 మైక్రోగ్రాములకు మించకూడదు. ఢిల్లీలో కాలుష్య స్థాయి పదకొండు రెట్లు ఎక్కువగా ఉన్నది. 
 
ఢిల్లీతో పాటు ఇతర మెట్రో నగరాల్లో కాలుష్యం తగ్గించడంపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదట వాహనాల కాలుష్యాన్ని నియంత్రించాలని.. ఎలక్ట్రికల్‌ వాహనాలను ప్రోత్సహించాలని.. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. పర్యావరణ అనుకూల పరిశ్రమలను స్థాపించేలా చూడాలని చెబుతున్నారు.
 
కర్మాగాల నుంచి వచ్చే పొగపై కఠినమైన నియంత్రణ అవసరమని.. చెత్తను కాల్చడంపై నిషేధం విధించాలని చెబుతున్నారు. వాస్తవానికి పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చెత్తను కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. మొక్కలను నాటడం.. నగరాల్లో పచ్చదనం పెంపుపై దృష్టి సారించడం అవసరమని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.