యునెస్కో జాబితాలో నారాయణపేట ముడమాల్‌ ‘నిలువురాళ్లు’

యునెస్కో జాబితాలో నారాయణపేట ముడమాల్‌ ‘నిలువురాళ్లు’
నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌లోని నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకుంది. పారిస్‌లోని యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందానికి సమాచారం ఇచ్చింది. అశోక శాసన ప్రదేశాలు, 64 యోగిని దేవాలయాలు సహా భారత్‌లోని ఆరు వారసత్వ ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించినట్లు బృందం పేర్కొంది. 
 
ఇందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా మడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లకు సైతం ఉన్నది.  ఈ నిలువురాళ్లు ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శిలాయుగంలోనే వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆదిమ మానవులు ఏర్పాటు చేసుకున్నట్లుగా చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు. 
 
యునెస్కో గుర్తింపు కోసం దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌, తెలంగాణ హెరిటేజ్‌శాఖ కృషి చేస్తున్నాయి. గతంలోని వరంగల్‌లోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ నిలువురాళ్లు శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్లని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. 
 
దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 100 వరకు గండ శిలలు ఉండగా.. ఒక్కొక్కటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. చిన్న, చిన్న రాళ్లు మరో రెండువేల వరకు ఉంటాయి. అయితే, వీటిని వాతావరణంలో మార్పులు, కాలాలను గుర్తించేందుకు నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. 
 
ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఓ రాయిపై సప్తర్షి మండలాన్ని మండలాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ నెల 7న ఆయా ప్రదేశాలను తాత్కాలిక జాబితాలో చేరినట్లు యునెస్కో లేఖ రాసింది. 
 
ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలంటే.. ప్రపంచ వారసత్వ కేంద్రం తాత్కాలిక జాబితాలో చేర్చడం తప్పనిసరి. తాత్కాలిక జాబితాలో చేర్చబడిన ప్రదేశాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, తెలంగాణలోని ముడుమాల్‌ మెగాలిథిక్ మెన్హిర్, పలు రాష్ట్రాల్లో నిర్మించిన అశోక శాసన ప్రదేశాలు, చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతదేశంలోని గుప్త దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని బుందేలాస్ రాజభవనాలు, కోటలు ఉన్నాయి.