ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొణిదెల నాగబాబు నామినేషన్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొణిదెల నాగబాబు నామినేషన్‌
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు బలపరిచారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు నామినేషన్ పత్రాలు అందజేశారు.
 
నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, అలాగే నామినేషన్‌ను బలపరిచిన లోకేష్‌, మనోహర్‌లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.
కాగా  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాల్లో ఒక అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఖరారు చేశారు. 

మరో నలుగురు అభ్యర్థులను తెలుగు దేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 10 లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. కాగా, తొలుత నాగబాబును రాజ్యసభకు పంపిస్తారంటూ వార్తలు వచ్చాయి. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నాగబాబును పంపించాలని అనుకున్నారు.  అయితే, ఆ స్థానాన్ని ఖాళీ చేయించింది తాము కాబట్టి, ఆ స్థానాన్ని తమకే వదలాలని బిజెపి కోరడంతో  సాధ్యంకాలేదు. పైగా, నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందుకనే ఆయన ఎమ్యెల్సీగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది.