మార్చి 7న తెలుగులో  ‘ఛావా’. సినిమా విడుదల

మార్చి 7న తెలుగులో  ‘ఛావా’. సినిమా విడుదల

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఛావా’. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ మేరకు పోస్ట్‌ పెట్టింది. గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్‌ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలిపింది. వెండితెర వేదికగా ఈ చిత్రాన్ని వీక్షించాలని ప్రేక్షకులను కోరింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవితం అధారంగా ఛావా రూపొందింది. శంభాజీ మహారాజ్‌ పాత్రలో విక్కీ కౌశల్‌, ఆయన భార్య యేసుబాయి పాత్రలో ప్రముఖ నటి రష్మిక కనిపించారు. శంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్‌ ఖన్నా చేశారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌లో ఈ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదల కానుందని ఇటీవల ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఛావా సినిమాలో భాగం కావడంపై విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. పోరాట యోధుడి కథలో నటించడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. 

ఆయన పాత్రలో నటించేటప్పుడు ఆయన ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణలో విక్కీ కౌశల్ చేతులను రాత్రంతా తాళ్లతో కట్టేయాల్సి వచ్చిందని, ఆ సీన్‌ తర్వాత సుమారు నెలన్నరపాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. శంభాజీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నివేశం షూట్‌ చేసినప్పుడు విక్కీ భావోద్వేగానికి గురైనట్లు మూవీ టీమ్ వెల్లడించింది.