సౌర‌శ‌క్తితో భార‌త్ సూప‌ర్ ప‌వ‌ర్

సౌర‌శ‌క్తితో భార‌త్ సూప‌ర్ ప‌వ‌ర్

సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్ గా మారిందని ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ విభాగం విష‌యాన్ని వెల్ల‌డించింద‌ని ఆయన చెప్పారు. ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే భారత్ చెప్పింది చేసి చూపించిందని ఆ సంస్థే పేర్కొంద‌ని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయ‌ని అంటూ, అందుకే ప‌లు దేశాలు సైతం ఇండియాను త‌మ వ్యాపార విస్త‌ర‌ణ కేంద్రంగా భార‌త్ కు వ‌స్తున్నార‌ని ప్రధాని చెప్పారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఆయ‌న సోమవారం మాట్లాడుతూ భారత్ మాటలకే పరిమితం కావడం లేదని, చేతల్లోనూ చూపిస్తోందని స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక రంగంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు చెప్పిందని ప్రధాని గుర్తుచేశారు.

కాగా ఈ సదస్సుకు ఆయ‌న ఆల‌స్యంగా రావ‌డంతో స్పందిస్తూ స‌ద‌స్సులో పాల్గొన్న వారికి క్షమాపణలు తెలియజేశారు. తాను ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని చెప్పారు. “10, 12 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ప్రారంభమయ్యే సమయం, నేను రాజభవన్ నుంచి బయల్దేరే సమయం ఒకటే అప్పుడు నేను వస్తే భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కావొచ్చు” అని తెలిపారు.

“దాంతో విద్యార్థులు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే వారంతా పరీక్షా కేంద్రాలకు వెళ్లిన తర్వాత రాజభవన్ నుంచి బయల్దేరాలనుకున్నాను. దాంతో 15-20 నిమిషాలు ఆలస్యమైంది. ఇక్కడ మీకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నాను” అని ప్రధాని వెల్ల‌డించారు.

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందని మోదీ పేర్కొన్నారు. “జనాభా పరంగా మధ్యప్రదేశ్ ఐదో అతిపెద్ద రాష్ట్రం. వ్యవసాయం, ఖనిజాల పరంగా ముందు వరుసలో ఉంది. రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి సారించింది” అని ప్రధాని తెలిపారు.

“20 సంవత్సరాలకు ముందు ఇక్కడికి రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందు వరుసలో ఉంది” అని ప్రధాని చెప్పారు. ఈ సద‌స్సుకి 60 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఆయా దేశాల దౌత్యవేత్తలు పాల్గొన్నారు. భారత వ్యాపార రంగ ప్రముఖులు కుమార్ మంగళం బిర్లా, గౌతమ్ అదానీ, నాదిర్ గోద్రెజ్ తదితరులు హాజరయ్యారు.