చిలుకూరు అర్చకుడిపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్

చిలుకూరు అర్చకుడిపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్
 
* రంగరాజన్ కు కేటీఆర్ పరామర్శ, సంజయ్ ఫోన్
 
చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. దురదృష్టకరమైన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలని చెప్పారు. 
 
కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు, పోరాటం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.  రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్‌పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. 
 
ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని పవన్ సూచించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారని తెలిపారు. ‘‘టెంపుల్ మూమెంట్ ’’ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో రంగరాజన్‌ తెలిపారని పేర్కొన్నారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారని చెప్పారు. 
 
చిలుకూరు వెళ్లి రంగరాజన్‌ని పరామర్శించి, అండగా ఉండాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగాన్ని ఆయన ఆదేశించారు. ఈ మేరకు రంగరాజన్‌‌కు భరోసా ఇవ్వాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.

కాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఉదయం అర్చకుడు రంగరాజన్‌ను కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ కుటుంబం సేవ చేస్తుందని గుర్తు చేసుకున్నారు. రంగరాజన్ పై దాడి పూర్తిగా ప్రభుత్వ విమర్శించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని చెబుతూ వీడియో అందుబాటులో ఉన్నప్పటికీ రెండు రోజులపాటు హోమ్ మంత్రి, ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా.  ఏ జెండా పట్టుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. 

రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ వద్ద భద్రతను ఏర్పాటు చేయాలని పేర్కొంటూ రంగరాజన్‌ను అవమానించడం అంటే దేవుని అవమానించడమే అని స్పష్టం చేశారు. రంగరాజన్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కాగా, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగరాజన్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ దాడిని ఖండిస్తూ ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు రంగరాజన్‌పై దాడి ఘటనలో పోలీసులు 17 మంది ఆచూకీని గుర్తించారు పోలీసులు. మొత్తం దాడి చేసిన వ్యక్తులు 22 మంది కాగా, వారిలో 17 మందిని పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిమందిని గుర్తించారు. ఈ ఘటనలో వీర రాఘవ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే వీర రాఘవరెడ్డి అనుచరులు ఐదు మందిని ఈరోజు మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.\

ఈ నెల 7న వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్‌ నివాసానికి చేరుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రాంగణంలోనే రంగరాజన్‌ నివాసం ఉంటుంది. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. 

అలాగే దేవాలయాన్ని తమకు అప్పగించాలని రంగరాజన్‌పై తీవ్ర ఒత్తడి తీసుకొచ్చారు. దీన్ని వ్యతిరేకించిన రంగరాజన్‌పై వీరరాఘవరెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారు. దీనిపై రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 22 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.