మహా కుంభమేళాలో తొక్కిసలాట .. 15 మంది మృతి?

మహా కుంభమేళాలో తొక్కిసలాట .. 15 మంది మృతి?
 
మహా కుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లోని సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అక్కడే ఉన్న బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. 
సంగమం వద్ద ఇవాళ తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ తొక్కిస‌లాట‌లో 15 మంది మృతి చెందినట్లు,  మ‌రో 50 మందికిపైగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌యాగ్‌రాజ్‌లోని స్వ‌రూప‌రాణి ఆస్ప‌త్రికి మృత‌దేహాల‌ను త‌ర‌లించారు.

తొక్కిసలాటలో జరిగిన వెంటనే సిబ్బంది తక్షణమే స్పందించారు. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌లో సెక్టార్‌2 ఆస్పత్రికి తరలించారు.  త్రివేణి సంగ‌మంలో తొక్కిస‌లాట జ‌రిగిన ప్ర‌దేశానికి ఉద‌యం సుమారు 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు మూడు గంట‌ల పాటు త‌ర‌లింపు ప్ర‌క్రియ జ‌రిగింది. 

అమావాస్య రోజున స్నానం చేయాల‌న్న ఉద్దేశంతో కోట్ల సంఖ్య‌లో భ‌క్తులు ప్ర‌యాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. అధికారులు అంచ‌నా ప్ర‌కారం ఇప్ప‌టికే 5 కోట్ల మంది ప్ర‌యాగ్‌రాజ్ ప‌రిస‌రాల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడు సాయంత్రం వ‌ర‌కు ఆ సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్‌ కమిటీ మౌని అమావాస్య సందర్భంగా  తొక్కిస‌లాట వ‌ల్ల 13 అకాడాలు అమృత స్నానం ర‌ద్దు చేసుకున్నాయి.

ఇవాళ దాదాపు 10 కొట్ల మందికి పైగా అమృత స్నానాలు ఆచరించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద 12 కిలోమీటర్ల పొడవున ప్రత్యేక ఘాట్‌ ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో పురుషులు, స్త్రీలు సహా అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో అరుస్తూ, కేకలు వేస్తూ తమ కుటుంబ సభ్యుల కోసం ఆర్తనాదాలు చేశారు

ఇదిలా ఉండగా, మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.  గంటలో మూడు సార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. 

మరోవైపు, సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. “త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి. ఆదేశాలు, సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించండి. ఎలాంటి వదంతులను నమ్మొద్దు” అని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.

కుంభమేళాకు భక్తులు పోటెత్తడం వల్ల అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే తొక్కిసలాట ఘటన తీవ్రమైనది కాదని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా తెలిపారు.  ఆమె తెలిపిన వివరాల ప్రకారం, సంగం నోస్ వద్ద అడ్డంకి విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ క్రమంలో భక్తులు ఒకరికొకరు పడిపోయారని చెప్పారు. 

ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారని, వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. భయాందోళన చెందాల్సిన పరిస్థితి లేదని స్పష్టం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో జగత్గురు రాంభద్రాచార్య భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. గంగానదికి సమీపంలోని ఏ ఘాట్‌లోనైనా పవిత్ర స్నానం చేయాలని సూచించారు. సంగం వద్ద మాత్రమే స్నానం చేయాలని భక్తులు అనుకోవద్దన్నారు. ప్రజలు గంగానదిపై నిర్మించిన ఏ ఘాట్‌లోనైనా స్నానం చేయాలని, నది ప్రతిచోటా ఒకేలా ఉంటుందని తెలిపారు. కాబట్టి సంగం వద్ద మాత్రమే స్నానం చేయాలని భక్తులు మొండిగా ఉండకూడదని, మేళా మొత్తం సంగం వలె పవిత్రమైనదని వెల్లడించారు.

ఈరోజు చేయనున్న అమృత్ స్నానం రద్దు చేసుకున్నట్లు అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్ర పురి తెలిపారు. సాధువులు, నాగ సాధువులతో కూడిన ఊరేగింపుతో స్నానం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఈ ఘటన కారణంగా నిలిపివేసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తాము ఫిబ్రవరి 3న మూడో అమృత స్నానం చేస్తామని పేర్కొన్నారు. అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య స్నానం కోసం తాము వెళ్లడం లేదని చెప్పారు.