వచ్చే నెల ఫ్రాన్స్ లో ప్రధాని మోదీ పర్యటన

వచ్చే నెల ఫ్రాన్స్ లో ప్రధాని మోదీ పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరగనున్న ఎఐ యాక్షన్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ శుక్రవారం వెల్లడించారు. 

ఈ సమ్మిట్‌కి నరేంద్ర మోదీ  సహ అధ్యక్షత వహిస్తారని జైశ్వాల్‌ తెలిపారు. మోదీ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ సమ్మిట్‌కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరైతే, మోదీ ఆయనను కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ సమ్మిట్‌కి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది.

కాగా, ఫిబ్రవరి 10-11 తేదీల్లో జరిగే ఎఐ యాక్షన్‌ సమ్మిట్‌ ఫ్రాన్స్‌లోని గ్రాండ్‌ పలైస్‌లో జరగనుంది. ఈ సమ్మిట్‌కి ఆ దేశాధినేతలతోపాటు, అంతర్జాతీయ సంస్థల నాయకులు, చిన్న, పెద్ద కంపెనీల సిఇఓలు, విద్యావేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు, కళాకారులు, పౌర సమాజ సభ్యులు పాల్గొంటారు. 

దాదాపు వంద దేశాలు, వెయ్యికి పైగా ప్రైవేటు రంగం, ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజ ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారని ఫ్రెంచ్‌ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ఎఐ గవర్నెస్‌గా ఏర్పడేందుకు గల సాధ్యాసాధ్యాలపైనా, ఎఐ వల్ల ప్రమాదాల గురించి ఈ సమ్మిట్‌లో చర్చించే అవకాశం ఉంది.