వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు

వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
 
* జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
 
భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధనౌకలు వచ్చి చేరాయి. అధునాతన ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ యుద్ధనౌకలను ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వీటిని ప్రారంభించారు. అనంతరం మూడు నౌకలను జాతికి అంకితం చేశారు.
ప్రధాన నౌకాదళ శక్తిగా భారత్ అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ ప్రపంచదేశాలు భారత్‌ను విశ్వసనీయ, బాధ్యతాయుత భాగస్వామిగా చూస్తున్నాయని తెలిపారు.
77వ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.  ఇలా ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వీటి రాకతో నేవీ బలం పెరుగనుంది.  ఈ యుద్ధ నౌకలు భారత సైనయానికి మరింత శక్తినిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణరంగంలో మేకిన్‌ ఇండియా ఆవిష్కృతమవుతోందని పేర్కొన్నారు.
 
 ప్రపంచంలో బలమైనశక్తిగా భారత్‌ మారుతోందని వ్యాఖ్యానించారు. దేశీయ విధానంలో యుద్ధనౌకల తయారీ గర్వకారణమని చెప్పారు. “ఈ మూడు కూడా మేడిన్ ఇండియానే. వీటిలో ఒకటి డెస్ట్రాయర్, మరొకటి ఫ్రిగేట్, ఇంకోటి సబ్ మెరైన్. ఇవన్నీ కలిపి ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇప్పుడు నౌకాదళ శక్తిపరంగా భారత్ మరింత బలోపేతమైంది. భారత్ సైనిక శక్తిని పెంచుకుంటున్నది వికాసం కోసమే. విస్తరణవాదం కోసం కాదు” అని ప్రధాని తెలిపారు. 
 
“సురక్షితమైన, వికాసశీలమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ సదా కోరుకుంటుంది. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కీలక పాత్ర పోషించనుంది. భారత నౌకాదళం ప్రపంచ దేశాలతో కలిసి సముద్ర జలాల మీదుగా ఆయుధాలు, డ్రగ్స్ రవాణా జరగకుండా, టెర్రరిజానికి ఊతం లభించకుండా అడ్డుకుంటోంది. నౌకాదళం అహర్నిశలు చేస్తున్న సేవల వల్లే భారత్‌ సురక్షిత స్థానంగా మారింది” అని ప్రధాని స్పష్టం చేశారు.

గత పదేళ్లలో దేశ సైన్యానికి 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘రక్షణ రంగంలో భారత్ ఆత్మ నిర్భరతను సాధిస్తోంది. దేశంలో జరిగిన రక్షణరంగ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ అడుగులు వేస్తోంది’ అని మోదీ తెలిపారు.

నౌకాదళం మరింత బలోపేతం

కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఐఎన్ఎస్ సూరత్‌ యుద్ధ నౌకలో ప్రాజెక్ట్ 15ఏ, ప్రాజెక్ట్ 15బీ డెస్ట్రాయర్లు ఉన్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి వెల్లడించారు. ఐఎన్ఎస్ నీల్‌గిరి యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్లు ఉన్నాయని, వీటిని కలిగిన తొలి భారత యుద్దనౌక ఇదేనని చెప్పారు. ఐఎన్ఎస్ వాఘ్​షీర్ యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 75 జలాంతర్గాములు (సబ్ మెరైన్లు) ఉన్నాయని ేర్కొన్నారు. 

ఈ మూడు యుద్ధ నౌకల చేరికతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని త్రిపాఠి తెలిపారు. హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రయోజనాలను కాపాడే క్రమంలో నౌకాదళం చేపట్టే ఆపరేషన్లకు ఈ యుద్ధ నౌకలు దోహదం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఐఎన్‌ఎస్‌ సూరత్  ఇది పీ15బి గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్‌ కింద అభివృద్ధి చేసిన నాలుగో యుద్దనౌక. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్‌ వార్‌షిప్‌లలో ఒకటి. దీనిని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి.

ఐఎన్‌ఎస్‌ నీలగిరి  పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ మొదటి నౌక. దీనిని శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. సముద్రంలో ఎక్కువసేపు ఉండటం దీని సామర్ధ్యం. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధనౌకలను సూచిస్తుంది.

ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్  పీ75 స్కార్పెన్ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. జలాంతర్గామి నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ భాగస్వామ్యమైంది. సముద్ర భద్రతలో ఈ యుద్ధనౌక కీలకం కానున్నది.