బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌
 
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఓ న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా  సోమవారం సాయంత్రం35 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. గతంలో జడ్పీ చైర్‌పర్సన్ సమావేశంలో కలెక్టర్​ను అడ్డుకున్నారని, హుజురాబాద్​లో దళిత బంధు నిధులు విడుదల చేయాలనే డిమాండ్​తో ఆందోళన చేపట్టిన నేపథ్యంలోనూ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్​లో నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఆయనపై మూడు కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పీఏ కత్తురోజు వినోద్ అలియాస్ గిరి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. 
 
ఈ నేఫథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా శాసనసభ స్పీకర్ ప్రసాద్​కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ వన్ టౌన్​కు చేరుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన వాదోపవాదాలు, పరస్పర దూషణల నేపథ్యంలో ఆదివారం నుంచి జిల్లాలో హైడ్రామా సాగుతున్నది. 
 
సమీక్ష ముగిసిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సంజయ్‌కుమార్‌ సమాధానం చెప్తూ.. కౌశిక్‌రెడ్డిపై కేసు పెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అదేరోజు సాయం త్రం తన పీఏతో కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లయ్య కూడా కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సమీక్షను అడ్డుకున్నారంటూ కరీంనగర్‌ ఆర్డీవోతోనూ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌.. స్పీకర్‌ను కలిసి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తున్నది.