బీసీసీఐ కార్యదర్శిగా సైకియా

బీసీసీఐ కార్యదర్శిగా సైకియా
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్‌జిత్‌ సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో సెక్రటరీ పదవిని జై షా నిర్వహించగా అతడు ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శిగా వైదొలిగాడు. కొద్దిరోజులుగా జై షా స్థానంలో తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్న సైకియా.. ఆదివారం నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టాడు.  ఆదివారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సైకియా కార్యదర్శిగా నియామకమయ్యారు. జై షా స్థానంలో సైకియా బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రభతేజ్‌ సింగ్‌ భాటియా కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఆశిష్‌ షెలార్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. షెలార్‌ మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దాంతో ఆయన బీసీసీఐలో పదవిని వదులుకున్నారు.

కాగా, టెస్టుల్లో భారత జట్టు ఇబ్బందిపడుతోందని బీసీసీఐ కొత్త కార్యదర్శి దేవ్‌జిత్‌ సైకియా అంగీకరించారు. రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో జట్టు మళ్లీ గాడినపడడం ఓ సవాల్‌గా అని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది. దాంతో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్స్‌ షిప్‌ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 
 
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌, చాంపియన్స్‌ ట్రోఫీపై దృష్టి సారించామని.. బీసీసీఐ నిపుణులతో మాట్లాడి సానుకూల ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తుందని సైకియా పేర్కొన్నారు.  భారత్‌ సిరీస్‌ల వారీగా ముందుకు వెళ్తుందని.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌పై దృష్టి
సారిస్తుందని తెలిపారు. 
 
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో టీమిండియా బాగా రాణించలేదని అందరికీ తెలుసునని.. ఇదే పెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఉంటుందని.. ఆ తర్వాత దుబాయి వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీలో ఉడాల్సి ఉందని.. ఒకేసారి ఒక టోర్నమెంట్‌ గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని తెలిపారు. 
 
గత రెండు రోజుల్లో చాలా అంశాలపై చర్చించామని.. ఎదురైన ఎదురుదెబ్బల నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. చర్చల్లో సానుకూల ఫలితాల కోసం నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ఐసీసీ అధ్యక్షుడు, మాజీ బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలను తాను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానని తెలిపారు.