‘గేమ్‌ఛేంజర్‌’ టికెట్ల ధరల పెంపు జీవో ఉపసంహరణ

‘గేమ్‌ఛేంజర్‌’ టికెట్ల ధరల పెంపు జీవో ఉపసంహరణ

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి సర్కారు వెనక్కి తగ్గింది. గేమ్‌ ఛేంజర్‌ టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. గేమ్‌ ఛేంజర్‌కు ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో టికెట్ల ధరలతో పాటు అదనపు షోలకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇకపై తెల్లవారు జామున స్పెషల్‌ షోలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, ఆరోగ్య భద్రత దృష్ట్యా స్పెషల్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది.

పుష్ప-2 తర్వాత ప్రీమియర్‌ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ఇకపై తెలంగాణలో టికెట్ల ధరల పెంపుతో పాటు బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు. ఇటీవల గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీకి ప్రభుత్వం టికెట్ల ధరలతో పాటు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. 

టికెట్ల ధరలు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ భరత్‌రాజ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు.. సినిమాకు బెనిఫిట్ షోలు అనుమ‌తినివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు ర‌ద్దని చెప్పి మ‌ళ్లీ ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించింది. 

ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్ షోలకు అనుమతించొద్దని స్పష్టం చేసింది. నిర్మాత‌లు భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి అన్యాయంగా వ‌సులు చేయ‌డం స‌రికాద‌ని, అలాగే అర్ధరాత్రి 1 గంట‌ల త‌ర్వాత సినిమా షోల‌కి ప‌ర్మిష‌న్ ఇవ్వడంపై పునఃసమీక్షించాలని చెప్పింది. ఈ మేర‌కు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ర‌విగుప్తను ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.