దేశంలో ధనిక సీఎం చంద్రబాబు, క్రిమినల్ కేసుల్లో రేవంత్

దేశంలో ధనిక సీఎం చంద్రబాబు, క్రిమినల్ కేసుల్లో రేవంత్
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(ఎన్‌ఈడబ్ల్యూ) నివేదిక పేర్కొన్నది. దేశంలోని  31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదికను సోమవారం ఏడీఆర్‌ విడుదలచేశారు. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా రూ.931 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది.
 
క్రిమినల్ కేసులలో అందరికన్నా ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఆయనపై మొత్తం 89 కేసులు ఉండగా, వీటిలో 72 కేసులు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ) కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ నివేదిక పేర్కొన్నది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ప్రకటించారు.

31 ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి కలిపి రూ.1,630 కోట్లు ఉంది. వీరందరి ఆస్తి కలిపితే సగటున రూ.52.59 కోట్లు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొన్నది. సీఎంల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు అధికం. ముఖ్యమంత్రులు అందరిలో తక్కువ ఆస్తి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉంది. ఆమెకు రూ.15 లక్షలు మాత్రమే.

చంద్రబాబు నాయుడు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ (రూ. 332 కోట్లు), కర్ణాటక సీఎం సిద్దరామయ్య (రూ. 51 కోట్లు) సంపన్న ముఖ్యమంత్రులు. అందరికన్నా ఆస్తి తక్కువ ఉన్నవారిలో మమతా బెనర్జీ తర్వాత జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (రూ. 55 లక్షలు), కేరళ సీఎం పినరాయ్ విజయం (రూ. 1. 18 కోట్లు) ఉన్నారు.

కాగా, అప్పులలో కూడా ముగ్గురు సంపన్న ముఖ్యమంత్రులే అందరికన్నా అగ్రగామిగా ఉన్నారు. అందరికన్నా ఎక్కువగా పేమ ఖండూ కు రూ. 182 కోట్లకు పైగా అప్పులు ఉండగా, సిద్దరామయ్యకు రూ. 23 కోట్లు, చంద్రబాబు నాయుడుకు రూ.10 కోట్లు ఉన్నాయి.

 ముఖ్యమంత్రులతో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్‌, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. నేరపూరిత బెదిరింపు(ఐపీసీ సెక్షన్‌-506), ఐపీసీ సెక్షన్‌-505(2), రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం(ఐపీసీ సెక్షన్‌-505), మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపించడం(ఐపీసీ సెక్షన్‌-420), ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం(ఐపీసీ సెక్షన్‌-477ఏ), మతవిశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం(సెక్షన్‌-295ఏ) వంటి ఆరోపణలతో రేవంత్‌ రెడ్డిపై కేసులు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. కాగా, రేవంత్‌ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రెండోస్థానంలో ఉన్నారు.