
స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా దేశంలోనే తొలిసారి కుత్రిమ మేధస్సుతో స్మార్ట్ పోలీస్ ఏఐను వినియోగిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఏలూరు పోలీసులు తొలిసారిగా దీన్ని ప్రారంబించారని, త్వరలోనే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ దీన్ని విస్తరిస్తామని తెలిపారు. నేర నమోదు నుంచి కేసు విచారణ వరకూ ఈ స్మార్ట్ పోలీస్ ఏఐ విచారణాధికారికి సహకరిస్తుందని డీజీపీ స్పష్టం చేశారు.
దీంతో పాటు ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం విజయవాడ పోలీసులు ఏఐ వజ్రాస్త్రం పేరిట ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగిస్తున్నారని చెప్పారు. ఇటీవల భవానీ దీక్షల విరమణతో పాటు దసరా ఉత్సవాల్లోనూ దీన్ని వినియోగించామని పేర్కొన్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో డ్రోన్ల వినియోగం కూడా పెంచినట్టు స్పష్టం చేశారు.
2025 మార్చి నాటికి పోలీసు కమాండ్ కంట్రోల్తో లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25 వేల పైచిలుకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. గతంతో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని ఆయన వివరించారు.
ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్కు సంబంధించిన 916 కేసులు నమోదు చేశామని చెబుతూ మొత్తంగా రూ.1,229 కోట్ల మేర నగదు సైబర్ నేరాల ద్వారా తస్కరించారని వెల్లడించారు. ఇలా సైబర్ నేరాల్లో సొమ్ము పోయిన వ్యవహారాల్లో గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే దాన్ని రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన సూచించారు.
చట్టంలో డిజిటల్ అరెస్టు అనేదే లేదని అలాంటి కాల్స్ను విశ్వసించవద్దని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రతీ జిల్లాల్లోనూ ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ పీఎస్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గంజాయి, డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈగల్ వ్యవస్థ ప్రజల్లోకి బలంగానే వెళ్తోందని చెబుతూ వీటిని అరికట్టేందుకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని వివరించారు.
ఈ ఏడాదిలో 10,380 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా సంబంధిత గిరిజన ప్రాంతాల వారికి సూచిస్తున్నట్లు డీజీపీ తెెలిపారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా గ్రేహౌండ్స్, పోలీసు ట్రైనింగ్ అకాడెమీ అప్పా కోసం స్థల సేకరణ చేశామని వివరించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు