తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం

తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం
తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామణి డబ్బు దోచినవారిని వదిలిపెట్టబోమని టిటిడి పాలకమండలి సభ్యుడు, బిజెపి నేత భానుప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పరకామణిలో విదేశీ డాలర్లు దోచినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిజిపి ద్వారకా తిరుమలరావుకు  ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ  ఘటనపై టిటిడి ఈవో శ్యామలరావు విజిలెన్స్‌ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 
 
పరకామణి దోపిడీలో  వైసిపి పెద్దల పాత్ర ఉందని భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. పరకామణిలో సుమారు రూ. 100 కోట్లు దోపిడీకి గురైనట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ రహస్య అర అమర్చి తరలించారని తెలిపారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు.

హుండీ నుంచి నగదు దొంగిలిస్తూ 2023 ఏప్రిల్ లోనే రవికుమార్ పట్టుబడ్డారని, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా చేశారని తెలిపారు. అయితే కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు నిందితుడ్ని వదిలేశారని ఆక్షేపించారు. పరకామణిలో అక్రమాలపై విచారణ చేసి నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

భక్తులు ఇచ్చే దానాలు అన్ని స్వామి వారి కార్పస్ నిధికి వెళ్తుందని,  కానీ రవికుమార్ అనే వ్యక్తి పరకామణి నుంచి విదేశీ డాలర్లు మాయం చేశాడని భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. తర్వాత ఆ కేసు ఏమైందో కూడా తెలియదని విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయంలో అలాంటి వ్యక్తులను కాపాడేలా కొందరు వ్యవహరించారని ధ్వజమెత్తారు. 

 
ఈ వ్యవహారంలో ట్రిపుల్ ఆర్ లు ఉన్నారని పేర్కొంటూ త్వరలోనే పాత్రధారులు, సూత్ర ధారుల వివరాలు బయట పెడతా అని స్పష్టం చేశారు. దొంగతనం కేసులో ఓ పోలీసు అధికారి ఒత్తిడితో రాజీకి వచ్చినట్టు విజిలెన్స్ నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. ఆ పోలీసు అధికారి ఎవరు? అన్నది బయటపెట్టాలని డీజీపీని కోరినట్లు  తెలిపారు. 
 
హుండీలో దొంగతనం చేసిన వారి నుంచి డబ్బులు బహుమతిగా తీసుకోవడం ఏంటని? ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల పై విచారణ జరగాలని తేల్చిచెప్పారు. ఓ క్లర్కు స్థాయి వ్యక్తి ని కాపాడుతోంది ఎవరు? అనేది తెలియాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు సర్వీసును పొలిటికల్ సర్వీసు గా మార్చారని భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు.