
లోక్సభ ఎన్నికల డేటా సెట్ను (సమాచారం ) భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) గురువారం విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలపై 42 గణాంక నివేదికలను, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఒక్కోక్కటి 14 నివేదికలను వెల్లడించింది. పారదర్శకత, పరిశోధన లక్ష్యంగా 100 గణాంకాలను విడుదల చేశామని, అతిపెద్ద డేటా సెట్ విడుదల ప్రపంచంలోనే మైలురాయిగా నిలుస్తుందని తెలిపింది.
పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలు, రాష్ట్రాల వారీగా ఎన్నికల అధికారులు, పోలింగ్ స్టేషన్ల సంఖ్య, రాష్ట్రం / పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా ఓటింగ్ శాతం, పార్టీల వారీగా ఓట్ల వాటా, లింగ ఆధారిత ఓటింగ్ వివరాలు, రాష్ట్రాల వారీగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం, ప్రాంతీయ వైవిధ్యాలు, నియోజకవర్గాల డేటా, జాతీయ, ప్రాంతీయ / గుర్తింపు పొందని, స్వతంత్ర పార్టీల పనితీరు, గెలిచిన అభ్యర్థుల విశ్లేషణ, నియోజకవర్గం వారీగా ఫలితాలు సహా ఇతర అంశాలు ఈ డెటాసెట్ అందిస్తుందని తెలిపింది.
లోక్సభ ఎన్నికల్లో 64.64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుని ప్రపంచ రికార్డు సృష్టించారని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) తెలిపింది. ఎన్నికల కోసం దాఖలైన నామినేషన్ల సంఖ్య 2024లో 12,459 కాగా, 2019లో ఈ సంఖ్య 11,692గా ఉంది. అలాగే 2024లో 8,360 మంది అభ్యర్థులు పోటీపడగా 2019లో ఆ సంఖ్య 8,054గా ఉందని పేర్కొంది.
పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. పురుష ఓటర్లు 65.55 శాతం ఉండగా, మహిళా ఓటర్లు 65.78 శాతం ఉన్నారు. 2019లో 726 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, 2024లో ఆ సంఖ్య 800 మందికి చేరుకుంది.
డేటా ప్రకారం 2019 నుండి ట్రాన్స్జెండర్ల ఓటర్ల సంఖ్యలో 46.4 శాతం పెరుగుదల నమోదైంది. 2019లో 61,67,482 మంది విభిన్న ప్రతిభావంతులు ఓటింగ్ కోసం నమోదు చేసుకోగా, 2024లో ఆసంఖ్య 90 లక్షలుగా ఉంది. 2019లో 540 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరగగా, 2024లో కేవలం 40 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరిగింది.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!