మొత్తం సినిమా పరిశ్రమను బోనులో నిలబెట్టే రేవంత్ ప్రయత్నం

మొత్తం సినిమా పరిశ్రమను బోనులో నిలబెట్టే రేవంత్ ప్రయత్నం
సినిమా పరిశ్రమ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్‌ను రాజేందర్ పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈటల రాజేందర్ వెంట ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌కు ఈటల రాజేందర్ ఒక విన్నపం చేశారు. రేవతి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని అల్లు అర్జున్‌ను కోరుతున్నట్లు ఈటల చెప్పారు. శ్రీతేజ్ మెడికల్ ఖర్చులు కూడా భరించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ నాయకులు, సినీ హీరోలు, క్రికెట్ ప్లేయర్స్‌కు భారీగా ఫాలోయింగ్ ఉంటుందన, వారు ఎక్కడికి వెళ్లినా భారీగా జనం వస్తారు కాబట్టి సెలబ్రిటీల పర్యటన ఉన్నప్పుడు ముందస్తు ఏర్పాట్లు అవసరం అని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో పోలీసులు, థియేటర్ యాజమాన్యం చెప్పేదానిలో పొంతన లేదని తెలిపారు.
 
పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం అని థియేటర్ యాజమాన్యం అంటుంటే, పోలీసులు మాత్రం తాము అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారని గుర్తు చేశారు. ఏది ఏమైనా, ఎవరి నిర్లక్ష్యమైనా ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరమని, వారి కుమారుడు ఇప్పుడు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడని చెప్పారు.
 
ఇక ఈ సంఘటన అందరికీ ఒక గుణపాఠం కావాలని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పొలిటికల్, సినిమా, క్రికెట్ స్టార్స్ మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. మరోవైపు ఈ ఘటనను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నట్లు ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఇలాంటి సంఘటనలు జరగాలని కావాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్న ఈటల రాజేందర్ మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలి తప్ప కావాలని వారిని పిలిపించి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టడం మంచిది కాదని హితవు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒక పాత బిల్డింగ్ మీదికి చాలా మంది ఎక్కగా, ఆరోజు ఆ ఇల్లు కూలి ఏదైనా జరిగితే దానికి ప్రధానిని బాధ్యుల్ని చేసేవారా? అని ఈటల ప్రశ్నించారు. 
 
కుంభమేళాలో కూడా తొక్కిసలాటలు జరుగుతాయని పేర్కొంటూ అధికారం ఉంది కదా అని ప్రభుత్వాలు ఏదిపడితే అది చేయడం కరెక్ట్ కాదని హితవు చెప్పారు. ఇలాంటి ధోరణిని ప్రజలు సహించరని హెచ్చరించారు. దీన్ని రాజకీయం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.