మరో రెండు నెలల్లో వందే భారత్‌ తొలి స్లీపర్‌ రైలు

మరో రెండు నెలల్లో వందే భారత్‌ తొలి స్లీపర్‌ రైలు
భారతదేశపు తొలి స్లీపర్‌ వందే భారత్‌ రైలు మరో రెండు నెలల్లో ట్రయల్‌ రన్‌ మొదలవనున్నది.  లోడెడ్‌ సిమ్యులేషన్‌ ట్రయల్స్‌ కోసం కోచ్‌లను ఐసీఎఫ్‌ చెన్నైకి పంపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ట్రయల్‌ తర్వాత రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ప్రస్తుతం తొలి రైలు ఏ మార్గంలో నడుస్తుందనే చర్చ సాగుతున్నది.

దేశంలోని వివిధ రైల్వే జోన్ల నుంచి రైల్వేబోర్డుకు భారీగానే ప్రతిపాదనలు వచ్చినట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నుంచి ప్రారంభించేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్‌ ట్రెయిన్‌కు విజయవంతంగా మధ్యప్రదేశ్‌లోని కజురహో- ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం చైన్నై ఐసీఎఫ్‌ నుంచి కజురహో చేరిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. శనివారం అక్కడి నుంచి మహోబాకు చేరుకున్నది. మరుసటి రోజు కజురహో నుంచి తిరిగి మహోబాకు వచ్చింది.
ఎస్‌ఆర్‌డీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్‌ రన్‌లో రైల్వే టెక్నికల్‌ టీమ్‌తోపాటు, ఐసీఎప్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు, తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది. అయితే వందేభారత్‌ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ. స్పీడ్‌తో వెళ్లేలా తయారుచేశారు.
ప్రస్తుతం వందే భారత్‌ స్లీపర్‌ రైలు చార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయని రైల్వేశాఖ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు.  ప్రస్తుతం రైల్వేశాఖ పది వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే తొలి నమూనా రైలును సిద్ధం చేసింది. భారతీయ రైల్వే ఆధునీకరణలో ఇదో పెద్ద ముందడుగు కానున్నది. 
రైల్వేశాఖ 200 వందే స్లీపర్‌ రైళ్లను సిద్ధం చేసేందుకు ప్రణాళికలను రూపొందించింది. రాబోయే రోజుల్లో వివిధ నగరాల మధ్య నడపాలని యోచిస్తున్నది. ఇక వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్‌ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
వందే భారత్‌ స్లీపర్‌ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్‌, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనున్నది. రైలులో ఫైర్‌ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్‌ వద్ద అత్యవసర స్టాప్‌ బటన్స్‌ సైతం ఉంటాయి. 
 
ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్‌ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి. అలాగే, రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు. 

బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్‌ ఆధారిత డిస్‌ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు వంటి సౌకర్యాలు ఈ మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నది. రైలులో ఆటోమేటెడ్‌ డోర్లు ఏర్పాటు చేశారు. టాయిలెట్‌లో ఎలాంటి బటన్‌ నొక్కకుండానే నీళ్లు వస్తాయి. ఒక కోచ్‌ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్‌ డోర్లు ఏర్పాటు చేశారు.

ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ యూనిట్‌ సైతం ఉంటుంది.ప్రతి కోచ్‌లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్‌ పెట్టుకునేందుకు ప్రతి బెర్త్‌ వద్ద సాకెట్‌ ఉంటుంది. అలాగే, బెర్త్‌ వద్ద చిన్న లైట్‌ సైతం ఉంటుంది. దాంతో ఎవరైనా బుక్‌లు, పేపర్‌ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. సేఫ్టీ ‘కవచ్’ సిస్టమ్, బ్లాట్‌ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. 

అయితే, వందే భారత్‌ తొలి రైలు ట్రయల్‌ రన్‌ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జరుగనున్నది తెలుస్తున్నది. రైల్వే డిజైన్ అండ్‌ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్ డి ఎస్ ఓ) పర్యవేక్షణలో ట్రయల్‌ జరుగనున్నది. రైలు స్థిరత్వం, వైబ్రేషన్‌, డైనమిక్‌ పనితీరును ట్రయల్స్‌లో అంచనా వేయనున్నారు.