
* ఒక్కరోజు హీరో జైలుకెళ్లొస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం పరామర్శిస్తరా?.. సీఎం
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఈ డబ్బులు అందజేస్తామని పేర్కొన్నారు.
తొక్కిసలాలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ వైద్య ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తానని చెప్పి అల్లు అర్జున్ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సినిమాలకు ప్రత్యేక మినహాయింపులు ఉండవని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అల్లు అర్జున్ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి ” సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి.. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందండి.. ప్రోత్సాహకాలు అందుకోండి.. షూటింగ్లకు ప్రత్యేక అనుమతులు తీసుకోండి.. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగిన తర్వాత ప్రత్యేక మినహాయింపులు ఉండవు” అని స్పష్టం చేశారు.
కాగా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని చెబుతూ ఈ విషయంలో పోలీస్ వైఫల్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతా రహితంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. 11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో, నిర్మాత వెళ్లలేదని, బాధిత కుటుంబాన్ని హీరో, నిర్మాత పరామర్శించలేదని చెప్పారు.
ఒక్క రోజు హీరో జైలుకు వెళ్లి వస్తేనే సినిమావారంతా ఇంటికి పరామర్శలకు క్యూ కట్టారని చెబుతూ అల్లు అర్జున్కు ఏమైనా కన్ను పోయిందా? కాళ్లు పోయాయా? చేతులు పోయినవా? కిడ్నీలు కరాబైనయా? ఎందుకు వెళ్లారు? అంటూ ప్రశ్నించారు. అక్కడ ఒక తల్లి చనిపోయింది. కొడుకు బ్రెయిన్డెడ్తో ఆసుపత్రిలో ఉన్నడు. ఒక్కరైనా పరామర్శకు వెళ్లివచ్చారా? అంటూ ఆయన టాలీవుడ్ ప్రముఖులపై ముఖ్యమంత్రి మండిపడ్డారు.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
ముస్లింలు, ఆర్ఎస్ఎస్ : వ్యక్తిగత స్మృతులు
చిన్న పార్టీలే బీహార్ విజేత నిర్ణేతలు