నాగారం గురుకులంలో విషాహారంతో 33 మంది అస్వస్థత

నాగారం గురుకులంలో విషాహారంతో 33 మంది అస్వస్థత

* పెద్దాపూర్‌ గురుకులంలో మరో విద్యార్థికి పాముకాటు

కలుషితాహారం కారణంగా 33 మంది మైనార్టీ గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో వారిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నాగారంలోని తెలంగాణ సాంఘిక, సంక్షేమ మైనార్టీ గురుకుల పాఠశాల (మల్కాజిగిరి)కు చెందిన విద్యార్థినులు గురువారం మధ్యాహ్నం భోజనం చేశారు.

సాయంత్రం అల్పాహారం సమయంలో కొందరు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అవుతున్నట్టు ప్రిన్సిపాల్‌ స్వప్నకు తెలిపారు. దీంతో 33 మందిని ఘట్‌కేసర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో దవాఖానలో చేర్చుకొని ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థినులకు చికిత్స అందించి తీసుకువెళ్లవచ్చని వైద్యులు సూచించారు.

విషయం తెలిసిన జిల్లా వైద్యాధికారి రఘునాథ్‌ స్వామి దవాఖానకు చెరుకుని విద్యార్థినుల పరిస్థితిపై అరా తీశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కీసర మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల వసతి గృహంలో ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచి గాయపరిచిన ఘటనను మరవక ముందే  ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. 

ఫుడ్‌ పాయిజన్‌ ఘటనతో తమకు సమాచారం ఇవ్వలేదని పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గురుకులంలో మెను ప్రకారం భోజనం పెట్టకుండా నాసిరకం భోజనం పెడుతుండడంతో అనారోగ్యం ఏర్పడుతుందని విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు.

విద్యార్థులకు భోజనానికి బదులుగా పాయిజన్ రూపంలో ఫుడ్ ను వాళ్ల శరీరంలో కొంచెం కొంచెం పంపిస్తున్నట్టుగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యాలు విషమతుల్యంగానే ఉన్నాయని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తే వాళ్లకు ఉన్న అనారోగ్య సమస్యలు బయటపడుతాయని తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. 

మరోవంక, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. బుధవారం ఓ విద్యార్థికి పాముకాటు వేయగా, తాజాగా గురువారం ఉదయం మరో విద్యార్థిని పాము కాటేసింది. కోరుట్లకు చెందిన బోడ అశ్విత్‌ గురువారం ఉదయం నిద్రలేచేసరికి కుడి అరచేయి, కుడికాలిపై కాట్లు ఉండటంతోపాటు దురద అనిపించడంతో తోటి విద్యార్థులకు, ప్రిన్సిపాల్‌కు తెలిపాడు. వెంటనే కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేటు దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి గురువారం వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పెద్దాపూర్‌ గురుకులానికి చేరుకుని ఆర్డీవో శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ మాధవీలతను నిలదీశారు. ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. గతంలోనూ ఇద్దరు మరణించినా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం మారుతీనగర్‌ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. కాగా ప్రిన్సిపాల్‌ మాధవీలతను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.