కాంగ్రెస్ పాలనలో నరకకూపాలుగా గురుకులాలు

కాంగ్రెస్ పాలనలో నరకకూపాలుగా గురుకులాలు
కాంగ్రెస్ పాలనలో నరకకూపలుగా గురుకులాలు మారిపోయాయని బీజేపీ ఎస్సి మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. సంక్షేమ వసతి గృహాల్లో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత దొడ్డుబియ్యాన్ని స్వాధీనం చేసుకుంది..? సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మొన్నటికి మొన్న వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆహారం వికటించి తొమ్మిదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తే.. కాంగ్రెస్ మంత్రులేమో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర దాగి ఉందంటూ  ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కుమార్ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో హాస్టళ్లు, గురుకులాల్లో అనేకమంది అభశుభం తెలియని విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం, అనారోగ్యంపాలవ్వడం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గురుకులాల్లో తప్పిదాలను సరిదిద్దుకోకుండా చోద్యం చూస్తున్నదని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ వైఖరితో మాసబ్ ట్యాంక్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ లో నిధుల్లేకుండా వెలవెలబోతున్నదని విమర్శించారు. 

 

తెలంగాణలో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చినా అవేమీ అమలు కావడం లేదని స్పష్టం చేశారు. బడ్జెట్ లోనూ ప్రస్తావించిన నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని చెబుతూ  గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులను దారిమళ్లిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులు అధ్యయనం చేసేందుకు తనిఖీల పేరుతో తూతూమంత్రంగా రాష్ట్ర మంత్రులు మూకుమ్మడిగా బయల్దేదారని ఎద్దేవా చేశారు.

విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల సంఖ్యను పెంచుతామంటూ హామీలు గుప్పించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని అంటూ టార్గెట్లేమో వందలు.. అమలు మాత్రం పదుల సంఖ్యలోనా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే నిరుపేద విద్యార్థులకు రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దరఖాస్తుల స్వీకరిస్తున్నా లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదని ధ్వజమెత్తారు.

 
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సమస్యలపై ప్రత్యేక సెషన్ నడిపి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కుమార్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఎస్సీ కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి రూ. 400 కోట్లు, గిరిజన సబ్సిడీ పథకాలకు రూ. 300 కోట్లు కేటాయిస్తామని…. ఖర్చు చేసింది అరకొర మాత్రమే అని తెలిపారు.