ఫిరాయింపు రాజకీయాలను జీర్ణించుకోలేకపోతున్నా

ఫిరాయింపు రాజకీయాలను జీర్ణించుకోలేకపోతున్నా

తెలంగాణాలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ఫిరాయింపు రాజకీయాలను జీర్ణించుకోలేక పోతున్నానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న అనుచ‌రుడు గంగారెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌పై తీవ్ర ఆవేద‌న‌తో స్పందిస్తూ .ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక‌ల‌తోపాటు మొత్తం 8 మందికి మూడు పేజీల‌ లేఖ రాశారు. అందులో పార్టీ ఫిరాయింపుల‌పై తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక పోతున్నాన‌ని, తీవ్ర మానసిక బాధతో లేఖ రాసిన‌ట్లు వెల్లడించారు.పార్టీ ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్ నుంచి కొంద‌రు కాంగ్రెస్‌లోకి రావ‌డం వ‌ల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యక‌ర్తలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నట్లు ఆందోళ‌న వ్యక్తం చేశారు. 

65 మంది ఎమ్మెల్యేల‌తో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సుస్థిర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. కొంద‌రు స్వార్ధ ప‌రులు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్పడుతున్నార‌ని ఆరోపించిన జీవ‌న్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి పిరాయింపుల‌కు ముఠా నాయ‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ పార్టీ బి ఫారంతో గెలిచిన వాళ్ల మాదిరి బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని ధ్వజ‌మెత్తారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు లేకుంటే ప్రభుత్వం నడవదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుదారులు కాంగ్రెస్ ముసుగు వేసుకోవడం త‌న‌కు బాధ కలిగిస్తోందని ఆందోళ‌న వ్యక్తం చేశారు. 

ఆధిపత్య పోరు కోసం గంగిరెడ్డిని క్రూరంగా హత్య చేశార‌న్న జీవ‌న్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సంజ‌య్ పాత్ర ఉంద‌ని తాను ఎక్కడ మాట్లాడ‌లేద‌ని స్పష్టం చేశారు. హ‌త్యకు పాల్పడిన బ‌త్తిన సంతోష్ బ‌ల‌మైన బీఆర్ఎస్ కార్యక‌ర్తగా మాత్రమే చెప్పాన‌ని వివ‌రించారు. నిందితుడు సంతోష్‌పై అనేక కేసులు ఉన్నాయ‌ని ఆరోపించిన జీవ‌న్ రెడ్డి ఎవ‌రి అంద‌డండ‌లు చూసుకుని గంగారెడ్డిని హ‌త్య చేశార‌ని ప్రశ్నించారు.

పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు. 

 
దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన మారు గంగారెడ్డిని ఎమ్మెల్యే సంజయ్‌ అనుచరుడిగా భావించే సంతోష్‌ కిరాతకంగా హత్య చేయడం కాంగ్రెస్‌ కార్యకర్తలను ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా సలహాదారు పదవి కూడా ఇచ్చారని మండిపడ్డారు.