
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనలో హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాక్టీస్ సందర్భంగా ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్ఫైర్ కావడంతో ఇద్దరు ఆర్మీ అగ్నివీరులు మరణించారు. మృతులిద్దరూ ఫైరింగ్ శిక్షణ కోసం హైదరాబాద్ నుంచి నాసిక్కు వెళ్లారు. దేశసేవ చేయాలని భావించిన వారు ఆ ఆశ తీరకుండానే అసువులు బాసారు.
మృతులు విశ్వరాజ్ సింగ్ (20), సైఫట్ షిట్ (21) గా గుర్తించారు. డియోలాలిలోని ఆర్టిలరీ స్కూలులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం, ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో భారత సైన్యానికి చెందిన ఇండియన్ ఫీల్డ్ గన్లో ఉన్న ఒక షెల్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక షెల్ పేలడంతో ఇద్దరు అగ్నివీరులకు తీవ్రగాయాలయ్యాయని, వారిని డియోలాలిలోని ఎంహెచ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారులు స్పందిస్తూ, ఈ పేలుడు ప్రమాదాత్మకంగా జరగడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఘటనపై హవిల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు గన్ పేలి ఇద్దరు అగ్నివీరులు మృతి చెందినట్టు డియోలాలి క్యాంప్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఇదే తరహా రాజస్థాన్లోని భరత్పూర్లో కూడా చోటుచేసుకుంది. మాక్ డ్రిల్ జరుగుతుండగా మంటలను ఆర్పే యంత్రం పేలడంతో అగ్నివీర్ సౌరభ్ పాల్ (24) మృతిచెందాడు. అతనిని ఉత్తరప్రదేశ్ వాసిగా గుర్తించారు.
నాసిక్లోని ఆర్టిలరీ కేంద్రంలో పలు సైనిక వ్యాయామాలు, ఫైరింగ్ ప్రాక్టీస్లు జరుగుతుంటాయి. కానీ, ఈ రకమైన ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి. సైనిక శిక్షణలో ఉన్న సైనికులు ఈ తరహా ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఈ ఘటన పట్ల సైనిక అధికారులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దేశ సేవలో పాల్గొన్న ఈ ఇద్దరు అగ్నివీరుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, సైనిక శిక్షణ క్రమంలో భద్రతా నియమాలు మరింత కఠినంగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
More Stories
అయోధ్యలో మసీదు నిర్మాణానికి బ్రేక్
రైల్వేలో సరికొత్త ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ
కోల్కతాలో భారీ వర్షం… విద్యుత్ షాక్ లకు 9 మంది మృతి