బోయి భీమన్న కుమార్తె డా. విజయభారతి మృతి

బోయి భీమన్న కుమార్తె డా. విజయభారతి మృతి
ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ విజయభారతి (84) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబీకులు శుక్రవారం ఉదయం సనత్‌నగర్‌లోని రెనోవా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విజయభారతి తండ్రి ప్రముఖ కవి, రచయిత బోయి భీమన్న. 
 
కాగా ఆమె న్యాయవాది, దివంతగత మానవ హకుల నేత బొజ్జా తారకంకు భార్య.  విజయభారతి కుమార్తె డాక్టర్‌ మహిత ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌ కాగా, కుమారుడు రాహుల్‌ బొజ్జా తెలంగాణ ఇరిగేషన్‌ శాఖలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా ఉన్నారు. విజయభారతి కోరికమేరకు ఆమె భౌతికదేహాన్ని కుటుంబసభ్యులు ఆదివారం గాంధీ మెడికల్‌ కళాశాలకు అప్పగించనున్నారు.
 
విజయభారతి రచయిత్రిగా, అనువాదకురాలిగా, తెలుగు సాహిత్య అకాడమీ డైరెక్టర్‌గా సామాజిక, సాహిత్యరంగాలకు ఎనలేని కృషి చేశారు. అంబేదర్‌ , జ్యోతిబా ఫూలేను అధ్యయనం చేశారు. ఆ ప్రభావంతోనే భారతీయ కుల వ్యవస్థ, స్వరూప స్వభావాల గురించి పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా విశ్లేషణలు చేస్తూ అనేక రచనలు చేశారు. నరమేథాలు నియోగాలు.. పురాణాలు మరోచూపు వాటిలో ప్రసిద్ధమైనవి.
 
కొద్దికాలం సమాచార, పౌరసంబంధాల శాఖలో అనువాదకురాలిగా సేవలందించారు. నిజామాబాద్‌ మహిళా కళాశాల అధ్యాపకురాలిగా, వైస్‌ ప్రిన్సిపల్‌గా 1965 నుంచి78 వరకు పనిచేశారు. తెలుగు అకాడమీలో రీసర్చి ఆఫీసరుగా, డిప్యూటీ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్‌చార్జి డైరెక్టర్‌గా 1999లో పదవీ విరమణ పొందారు.
 
అంబేద్కర్‌, ఫూలే జీవిత చరిత్రలను మొట్టమొదటిసారిగా తెలుగు సమాజానికి అందించిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. వాటన్నింటినీ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఆమెను పలు సాహిత్య అవార్డులు స్వీకరించారు. డాక్టర్‌ విజయభారతి 2013-2015 మధ్య సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ అధ్యక్షురాలిగా కొనసాగారు. 
 
దళితుల హక్కుల కోసం కీలకంగా పనిచేశారు.ఇటీవలనే ఆమె రాసిన వ్యాస సంకలనం ‘75ఏళ్ల స్వతంత్ర భారతం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా’ అనే శీర్షికతో వెలువడింది. ఆత్మకథను కూడా రాసి ప్రచురణకు సిద్ధం చేసి ఉంచారు.
 
డాక్టర్‌ విజయభారతి మృతిపై ప్రముఖులు, సాహితీవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక రంగాలకు ఆమె చేసిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. డాక్టర్‌ విజయభారతి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. సాహిత్య, సామాజిక అధ్యయనశీలిగా విశ్లేషకులుగా డాక్టర్‌ విజయభారతి చేసిన కృషిని కేసీఆర్‌ స్మరించుకున్నారు.