హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. విమానంలో బాంబు బెదిరింపు కారణంగా జబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన 6ఈ-7308 విమానం ఆదివారం ఉదయం నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించామని ఎయిర్‌లైన్‌ పేర్కొంది. 
 
నాగ్‌పూర్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణికులను దింపివేసి ఆ తర్వాత తనిఖీలు నిర్వహించినట్లు చెప్పింది. విమానంలోని వాష్‌రూమ్‌లో పేపర్‌పై బాంబు బెదిరింపు పేపర్‌ లభ్యమైందని పోలీసులు తెలిపారు. భద్రతా సంస్థలు విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయని, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని స్పష్టం చేశారు.
 
ఆ తర్వాత అదే విమానంలో ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించనున్నట్లు ఆ అధికారి తెలిపారు. ఈ నెల 22న ముంబయి ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో విమానాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి.. ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 
 
విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. విమానంలోని టాయిలెట్‌లో టిష్యూ పేపర్‌పై ‘ఫ్లైట్‌లో బాంబు ఉంది’ అనే సందేశం కనిపించింది. 22న ముంబయి నుంచి తిరువనంతపురం వెళ్తుండగా ఎయిర్‌ ఇండియా విమానం ఏI657లో హెచ్చరిక పేపర్‌ గుర్తించినట్లు ఎయిర్‌ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.