
65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్), జీ2సీ (గవర్నమెంట్ టూ సిటీజన్) కనెక్టివిటీ కల్పించడంతో పాటు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300లకే ఇంటర్నెట్, కేబుల్ టివి, ఈ- ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ-ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రూ. 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు.
మొత్తం పెట్టుబడి వ్యయం రూ.1,779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఎఫ్ఓ) ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఓఎఫ్ఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను ముఖ్యమంత్రి కోరారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ లైనియర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడుస్తుంటే మిగతా ప్రాంతాల్లో రింగ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా టీ-ఫైబర్ నడుస్తోందని కేంద్ర మంత్రికి సిఎం వివరించారు. ఈ రీత్యా నెట్ వర్క్ సమర్థ నిర్వహణ, వినియోగం కోసం సకాలంలో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ మౌలిక సదుపాయాలకు అందించాలని ప్రతిపాదించారు.
ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భారత్ నెట్ -3 ఆర్కిటెక్చర్కు మార్చడానికి గతేడాది అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ను పంపించిందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ డిపిఆర్ను త్వరగా ఆమోదించాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. భారత్ నెట్ – 3 ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల పౌరులకు ఈ-గవర్నెన్స్ను అందించగలుగుతామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పనకు ఉద్ధేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ-ఫైబర్కు వర్తింపజేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్