ఏపీకి కేంద్రం రూ 1500 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల

ఏపీకి కేంద్రం రూ 1500 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (సాకి) కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో తొలి విడతగా రూ. 1500 కోట్లు విడుదలయ్యాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఏయే మార్గాల్లో నిధులు రాబట్టాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 
 
ఇందులో భాగంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలనూ గుర్తించి ఆ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రెండుసార్లు దిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్, ఆ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం నిధుల కోసం ఢిల్లీ వెళ్లి ఆర్థిక  మంత్రిని కలిశారు. 
 
మరోవైపు అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెరిగే విధంగా కేంద్రం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది.  కేంద్ర ప్రభుత్వమే ఇందుకు నిధులు ఇస్తుంది. దాదాపు 50 ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిధులను సమకూరుస్తుంది. 
 
సాకి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ 2,200 కోట్లు  రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ పథకం కింద రూపొందించిన విధివిధానాల ప్రకారం ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదం తెలుపుతుంది.  కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 66 శాతం కేంద్రం విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆ మేరకు తొలి విడతగా రూ 1500 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. 
 
ఈ నిధులను ప్రత్యేకంగా నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పటి నుంచో పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగులో ఉన్నాయి.  గత ప్రభుత్వం బిల్లులు చెల్లింపక పోవడంతో అనేకమంది కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. పనులను అర్ధాంతరంగా ఆపివేశారు. ప్రస్తుతం వచ్చే నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించి పనులను ముందుకు నడిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

మరోవంక, రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు రూ. 15,000 కోట్ల రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. ఈ విషయమై క్షేత్రస్థాయి పరిశీలనకు ఈ రెండు బ్యాంకుల నుండి ఓ ప్రతినిధివర్గం మంగళవారం నుండి వారం రోజులపాటు ఇక్కడ పర్యటిస్తున్నాయి. 

 
ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ, సీఆర్​డీఏ ఉన్నతాధికారులతో వరుసగా భేటీ అవుతారు. మధ్యలో మూడు రోజులు రాజధానిలో పర్యటిస్తారు. వెలగపూడిలోని తొలిరోజు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో తొలిరోజు భేటీ అవుతారు. అనంతరం ముఖ్యమంత్రితో సచివాలయంలోనే అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.