
కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఇప్పటివరకు ఎన్నో సంచలన విషయాలు బయటపడినప్పటికీ, అవేవీ నిజం కాదని కోల్కతా పోలీస్లు తోసిపుచ్చారు. మేజిస్ట్రేట్ ఎదుటే జరిగిన వైద్యురాలి పోస్ట్మార్టం ప్రక్రియ మొత్తం వీడియోగా తీశారు. అందులో ఎక్కడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్టు ప్రస్తావించలేదు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్ట్మార్టంలో గుర్తించారని వార్తలు వచ్చాయి.
ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషనే ఈ విధమైన పలు కథనాలకు దారి తీసిందని, కోల్కతా పోలీస్ చీఫ్ వినేశ్ గోయల్ పేర్కొన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే ఈ ప్రయత్నాలని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని కోల్కతా హైకోర్టు వ్యాఖ్యానించింది.
అలాగే ఆస్పత్రి యంత్రాంగం కేసు నమోదు చేయక పోవడాన్ని ప్రశ్నించింది. మృతి ఘటనలో ఎటువంటి ఫిర్యాదు అందనప్పుడు పోలీస్లు దాన్ని మొదట అసహజ మరణంగానే నమోదు చేస్తారని గోయల్ పేర్కొన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా అదిహత్యా, లేక ఆత్మహత్యా అనేది ప్రస్తావిస్తారని తెలిపారు.
అసహజ మరణంగా నమోదు చేయడం ద్వారా విషయాన్ని దాచిపెట్టి, ఆత్మహత్యగా చూపించాలని అనుకుంటున్నామని ఆరోపించడంపై గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న కొన్ని పోస్ట్లు సహచర వైద్యుల్ని అనుమానితులుగా పేర్కొన్నాయి. ఆమె తల్లిదండ్రులు కొన్ని పేర్ల జాబితాను సీబీఐకి ఇచ్చినట్టు పేర్కొన్నాయి.
ఒక్క వాలంటీర్ పేరు మినహా ఇప్పటివరకు ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయలేదు. ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తలను గోయల్ తోసిపుచ్చారు.
ఇక ఆ జూనియర్ డాక్టర్ పేరుతో ఉన్న ధ్రువీకరించని ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ వైరల్ అయింది. ఈ లీక్ అత్యాచార కేసుల్లో బాధితురాలికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించ కూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో పోలీస్ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ను పోలీస్లు అరెస్ట్ చేశారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు