ఆరు నెలలవుతున్నా కేటీఆర్​ను అరెస్టు చెయ్యరే!

ఆరు నెలలవుతున్నా కేటీఆర్​ను అరెస్టు చెయ్యరే!
ఎఫ్​-1 రేస్​ కార్లకు ఎలాంటి జీవో లేకుండా కేటీఆర్​ చెబితే రూ.50 కోట్ల ఇచ్చామని హెచ్​ఎండీఏ గ్రోత్​ కమిషనర్​ అర్వింద్​ కుమార్​ చెప్పి ఆరు నెలలవుతున్నా కేటీఆర్​ను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్​ రావు ప్రశ్నించారు. దీనిపై రేవంత్​ రెడ్డి కేటీఆర్​తో అమెరికాలో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారేమో తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు.
 
సంగారెడ్డిలో హర్​ఘర్​ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన  కాంగ్రెస్​, బీఆర్ఎస్​లు మొదటి నుంచి తోడుదొంగల పార్టీలు అని విమర్శించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మబొరుసు లాంటివని అభివర్ణించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్​మీట్​లతో సరిపెడుతున్నాయి తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

తప్పు చేసిన వాడు కొడుకైనా, కుమార్తైనా శిక్షించడానికి వెనుకాడనని ఆనాడు మాజీ సీఎం కేసీఆర్​ అన్నారని, కానీ ఆయన మనసు ఒప్పలేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేతల్లో ఏమీ చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ల తీరు అత్త కొట్టింది కోడలు ఏడ్చింది అన్న చందంగా ఉందని ధ్వజమెత్తారు.

సుంకిశాల కూలిపోయిన విషయంపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్​కి దమ్ము లేదని రఘనందన్​ ఆరోపించారు. పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష బాధ్యత బీఆర్ఎస్​ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ​ఔటర్​ రింగ్​రోడ్డు వ్యవహారంలో రూ.1000 కోట్లకు నోటీసులిచ్చిన హెచ్​ఎండీఏ అధికారి అరవింద్​ను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు.