మొబైల్ ఫోన్, బంగారం, వెండి ధరలు తగ్గుతాయి

మొబైల్ ఫోన్, బంగారం, వెండి ధరలు తగ్గుతాయి

* రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్‌

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి తన ఏడో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. కొన్ని రంగాలకు కీలక కేటాయింపులు చేశారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన వాటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టుగా కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని తరువాత, అనేక వస్తువులు వినియోగదారులకు చౌకగా, ఖరీదైనవిగా మారాయి. 
 
అంతేకాదు నిత్యం ధరలు అధికంగా ఉండే వాటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి, రాగి ధరలను తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బీసీడీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు.

క్యాన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపునిచ్చారు. సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని కూడా ఆర్థికమంత్రి ప్రతిపాదించారు.

భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించే ప్రయత్నంలో కెమెరా లెన్స్‌లతో సహా వివిధ భాగాలపై దిగుమతి పన్నులను తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గించారు. ఈ విధానం మార్పు భారతదేశంలో ఫోన్‌లను తయారు చేయడానికి కంపెనీలకు చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇ-కామర్స్‌పై టిడిఎస్ రేటు 1 శాతం నుండి 0.1 శాతానికి తగ్గించారు. ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగించారు. అయితే, అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్‌లపై 25 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది

ఈ బడ్జెట్‌లో కొత్తపన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లకు కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. రూ.3 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదని తెలిపారు. కొత్తపన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు ఇలా ఉన్నాయి: 

మూడు లక్షల వరకు ఎలాంటి పన్నూ లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారికి 5 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అదేవిధంగా రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 10 %, రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షలు వరకు 20 %, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం మేర పన్ను వర్తించనున్నట్లు ఆర్ధిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఇక స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచినట్లు స్పష్టం చేశారు.

బడ్జెట్ లో 10 ప్రధాన అంశాలు

1. ద్రవ్యలోటు జీడీపీలో 4.9శాతం అంచనా వేశారు. 2025-26లో 4.5శాతానికి తగ్గుతుంది.

2. కొత్త పన్ను విధానంలో మాత్రమే వ్యక్తిగత ఆదాయపు పన్నుపై స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచారు. పన్ను చెల్లింపుదారులకు రూ.17,500 ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది పాత పన్ను విధానానికి అమలు కాదు.

3.  స్వల్పకాలిక కాపిటల్ గెయిన్స్ కింద కొన్ని ఆస్తులకు 20 శాతం పన్ను విధిస్తారు. దీర్ఘకాలిక కాపిటల్ గెయిన్స్ కింద మినహాయింపు పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచారు. 10 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది.

4. వచ్చే ఆరు నెలల్లో జీఎస్టీ సరళీకృతం, హేతుబద్ధం చేయబడుతుంది.

5. ఉపాధి కల్పన-నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగంగా మెుదటిసారి సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరేవారు, తయారీ రంగంలో చేరేవారికి ఒక నెల జీతం ఇవ్వనుంది ప్రభుత్వం. నెలకు రూ.15,000గా ఇస్తారు.

6. కొలేటరల్ లేదా థర్ట్ పార్టీ గ్యారెంటీ లేకుండా రుణం కోసం క్రెడిట్  గ్యారంటీ ఎంఎస్ఎంఇ  క్రెడిట్ సులభతరం చేస్తారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ కోసం వారి స్వంత రిస్క్ అసెస్‌మెంట్ మోడ్‌లను కలిగి ఉంటాయి.

7. 5 సంవత్సరాలలో 500 కంపెనీలలో కోటి మంది యువకులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం సులభతరం చేస్తుంది. ఇంటర్న్‌షిప్ ఫీజుగా నెలకు రూ.5000 చెల్లిస్తారు. సీఎస్ఆర్ నిధుల నుంచి శిక్షణ ఖర్చులను కంపెనీలు భరించాలి.

8. మహిళలు, బాలికలకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.3లక్షల కోట్ల కేటాయింపు.

9. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు.

10. 5 సంవత్సరాల కాలానికి 4.1 కోట్ల యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పించడం.

ఇవే కాకుండా విద్యా, ఉద్యోగం, నేపుణ్యం కోసం 1.48 లక్షల కోట్ల కేటాయింపులు చేసినట్టుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉద్యోగం, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ, మధ్య తరగతిపై ఈసారి బడ్జెట్‌లో ఫోకస్ పెట్టినట్టుగా చెప్పారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

వచ్చే ఐదు సంవత్సరాలలో 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టుగా కేంద్ర మంత్రి ప్రకటించారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మూడు శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని చెప్పారు. స్వయం ఉపాధి పొందే చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచుతున్నట్టుగా పేర్కొన్నారు.