తిరిగి పట్టాలెక్కనున్న విశాఖ మెట్రో రైల్!

తిరిగి పట్టాలెక్కనున్న విశాఖ మెట్రో రైల్!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చెందనున్న విశాఖపట్టణం మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. 
 
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే ఫ్లై ఓవర్లుకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్​హెచ్​ఏఐతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.
 
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌ ఎండీ యూజేఎమ్ రావుకు చంద్రబాబు తెలిపారు. ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు నగర పరిధిలో పలుచోట్ల పైవంతెనల నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించాక మెట్రో కోసం మళ్లీ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఉన్నవాటిని కూల్చడం, మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు తెచ్చిపెడతాయని భావించారు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్‌హెచ్‌ఏఐకు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని సూత్రప్రాయంగా సీఎం ఆ సమీక్షలో తెలియజేశారు. ప్రస్తుతం విశాఖలో 12 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌ రూపొందించింది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం తప్ప మరే పనీ జరగలేదు. 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించింది. 2018లోనే అర్హత కలిగిన 5 నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేసింది. ప్రాజెక్టు పట్టాలెక్కే సమయంలో ఎన్నికలు రావడం తరువాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది.

2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో పిలిచిన టెండర్లతో పాటు డీపీఆర్‌ను రద్దు చేసి మళ్లీ కొత్తగా చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటిగా స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల కారిడార్‌ నిర్మించి ఆ తర్వాత, భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.