![](https://nijamtoday.com/wp-content/uploads/2024/02/ED-1024x683.jpg)
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రముఖ ఛారిటీ సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు జరిపారు. విదేశాల నుంచి వచ్చిన విరాళాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ‘ఆపరేషన్ మొబిలిటీ’ (ఓమ్) అనే ఛారిటీ సంస్థపై ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్ శివార్లలోని మొత్తం 11 ప్రాంతాల్లోని ఓం ఛారిటీ కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ డివైజ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఈడీ మంగళవారం వెల్లడించింది. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్లాండ్, ఐర్లాండ్, మలేషియా, నార్వే, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, రొమేనియా, సింగపూర్, స్వీడన్ స్విజ్జర్ ల్యాండ్ వంటి 16 దేశాల నుంచి ఓఎమ్ ఛారిటీ సంస్థకు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి.
అనాథలు, పేదల పిల్లలకు ఉచిత విద్య, భోజనం అందిస్తామని, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామంటూ ఓమ్ ఛారిటీ సంస్థ ప్రతినిధులు విదేశీ దాతల నుంచి రూ.300 కోట్లు సేకరించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి సేకరించిన విరాళాలను పక్కదారి పట్టించినట్టు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. కాగా తెలంగాణతో పాటు ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ ఈ సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఈడీ దాడులు నిర్వహించినట్టు సమాచారం.
సిఐడి ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ గ్రూప్ నడుపుతున్న 100కి పైగా గుడ్ షెపర్డ్ పాఠశాలల్లో పిల్లలు చదువుతున్నారు. ఈ నిధులను ఆస్తుల సృష్టి, ఇతర అనధికారిక ప్రయోజనాల కోసం మళ్లించారని ఇడి ఆరోపించింది. విద్యార్థుల స్పాన్సర్షిప్, ట్యూషన్, ఇతర ఫీజులను విద్యార్థుల నుంచి నెలకు రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు వసూలు చేసి, గణనీయమైన నిధులను ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టి ఓఎం గ్రూప్నకు చెందిన ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. విద్యాహక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం నుంచి నిధులను సక్రమంగా నమోదు చేయలేదని, ఇతర ఆదాయాలను ఖాతాల పుస్తకాల్లో చాలా తక్కువగా నివేదించారని ఇడి ఆరోపించింది.
చారిటీస్ నిధులను, గ్రూపు లోని కీలక ఆఫీస్ బేరర్లకు చెందిన పలు స్థిరాస్తుల కోసం దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. చాలా గ్రూపు సంస్థలకు ఎఫ్ సిఆర్ఎ రిజిస్ట్రేషన్లు రెన్యువల్ కాలేదని, వాటిని దాటవేసేందుకు ఎఫ్సిఆర్ఎరిజిస్టర్డ్ ’ఓఎం బుక్స్ ఫౌండేషన్ ’లో వచ్చిన విదేశీ నిధులను ఇంకా తిరిగి చెల్లించని రుణాలుగా ఇతర గ్రూపు సంస్థలకు మళ్లించారని వెల్లడించింది.
More Stories
స్మార్ట్ సిటీస్ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం
ఎస్బీఐ ఛైర్మన్ గా తెలుగు వ్యక్తి శ్రీనివాసులు శెట్టి
ఎట్టకేలకు జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం