ఓహ్‌.. మీరేనా నన్ను ఓడించింది..

ఓహ్‌.. మీరేనా నన్ను ఓడించింది..
ఓడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌  మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకొని అందరి మన్ననలు పొందారు. ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన బీజేపీ ఎమ్మెల్యేని అభినందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

నవీన్‌ పట్నాయక్‌ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్‌ జిల్లాలోని కంటాబంజి స్థానాల్లో బరిలోకి దిగారు. అయితే కంటాబంజిలో బీజేపీ అభ్యర్థి లక్ష్యణ్‌ బాగ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. 

అక్కడ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరినీ పలకరించి అభినందనలు తెలిపారు. ఆ సమయంలో నవీన్‌ పట్నాయక్‌ను చూసిన లక్ష్మణ్‌ బాగ్‌  లేచి నమస్కరించి పరిచయం చేసుకున్నారు. వెంటనే నవీన్‌ పట్నాయక్‌ ‘ఓహ్‌.. మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’ అని అన్నారు.

దీంతో ఓడించిన అభ్యర్థిని ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపిన నవీన్‌ పట్నాయక్‌ను చూసి అక్కడున్న నూతన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

కాగా, 24 ఏళ్లు ఒడిశాకు సీఎంగా సేవలందించిన నవీన్‌ పట్నాయక్‌ దూకుడుకు ఈ సారి బీజేపీ అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్‌ పార్టీ పరాజయం పాలైంది. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.