ప్రపంచ విద్య, విజ్ఞాన కేంద్రంగా మార్చడమే లక్ష్యం

ప్రపంచ విద్య, విజ్ఞాన కేంద్రంగా మార్చడమే లక్ష్యం
భారతదేశాన్ని ప్రపంచ విద్య, విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే నలంద యూనివర్సిటీని సందర్శించే అవకాశం తనకు లభించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.  బిహార్‌ రాజ్‌గిర్‌లోని నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ రాజేంద్ర వీ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, భారత విదేశాంగ మంత్రి ఎన్ జై శంకర్ పాల్గొన్నారు.

‘దేశ గుర్తింపును ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఆవిర్భవించడమే నా లక్ష్యం. ప్రముఖ నాలెడ్జ్ సెంటర్ అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో కోటి మందికి పైగా విద్యార్థులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందుతున్నారు. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోంది’ అని ప్రధాని చెప్పారు. 

ఈ కొత్త క్యాంపస్ ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేస్తుందని పేర్కొంటూ నలంద అనేది కేవలం పేరు మాత్రమే కాదని, ఒక గుర్తింపు, గౌరవం అని, నలంద ఒక విలువైన మంత్రం అని ప్రధాని తెలిపారు. అగ్ని పుస్తకాలను కాల్చగలదు గానీ జ్ఞానాన్ని నాశనం చేయలేదని స్పష్టంచేశారు.  నలంద కొత్త క్యాంపస్ దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి ఉదాహరణగా చూపుతుందని ప్రధాని అభిలాష వ్యక్తం చేశారు. బలమైన మానవ విలువలపై ఆధారపడిన దేశాలకు గతాన్ని ఎలా పునరుద్ధరించాలో, మంచి భవిష్యత్తుకు పునాది ఎలా వేయాలో చూపుతుందని ఆయన చెప్పారు. 

“గత 10 ఏళ్లలో దేశంలో సగటున ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం నిర్మితమవుతోంది. ప్రతి రోజూ సగటున రెండు కొత్త కళాశాలలు నిర్మితవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 23 ఐఐటీలు ఉన్నాయి. 10 ఏళ్ల కిందట 13 మాత్రమే ఉండేవి.’ అని ప్రధాని మోదీ వివరించారు.  అంతకుముందు ప్రధాని మోదీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన నలంద మహావిహారను సందర్శించారు. ఏఎస్ఐ పట్నా సర్కిల్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ గౌతమి భట్టాచార్య నలంద విశ్వవిద్యాలయ పురాతన శిథిలాల గురించి ప్రధానమంత్రికి వివరించారు.

నలంద విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం 2010లో స్థాపించిన ఈ విద్యాసంస్థ 2014 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. 5వ శతాబ్దం నుంచి కొనసాగుతున్న నలంద విశ్వవిద్యాలయంలో ప్రపంచంలోని నలుమూలలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. 12వ శతాబ్దంలో దండయాత్ర సందర్భంగా ధ్వంసం కావటానికి ముందు 800 సంవత్సరాలు ఈ విశ్వవిద్యాలయం భాసిల్లినట్లు నిపుణులు చెబుతున్నారు. నలందా యూనివర్సిటీ భారత ఉప ఖండంలో అతిపురాతమైన విశ్వవిద్యాలయం.

12వ శతాబ్దంలో భారతదేశంలోకి చొరబడిన ఆఫ్ఘన్లు ఈ విశ్వవిద్యాలయాన్ని కూల్చివేశారు. అందులోని పుస్తకాలు, ఇతర గ్రంథాలను తగులబెట్టారు. ఇక ఆ తర్వాత కొత్తగా న‌లంద విద్యాసంస్థను 2010 లో ప్రారంభించగా.. 2014 నుంచి ఇది పనిచేస్తూ ఉంది. ఈ ప్రాంతాన్ని 2016లో ఐక్యరాజ్యసమితి వారసత్వ సంపదగా ప్రకటించింది.