కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా తిరిగి సోనియా

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా తిరిగి సోనియా
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల సమావేశంలో సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించారు.
 
ఈ ప్రతిపాదనను పార్టీ నేత గౌరవ్ గొగోయ్, సీనియర్ నేత తారిఖ్ అన్వర్ బలపరిచారు. సోనియా తన అంగీకార ప్రసంగంలో, పార్టీని నాశనం చేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్న శక్తివంతమైన, దుర్మార్గపు ప్రయత్నాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మరోసారి తన సామర్ధ్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు.
 
“ఇది మనల్ని ఆర్థికంగా కుంగదీయడానికి ప్రయత్నించింది. మనపై, మన నేతలపై అబద్ధాలు, పరువు నష్టంతో కూడిన ప్రచారాన్ని సాగించింది. ఎందరో మానపనిపోయిన్నట్లు అంచనాలు వేశారు. కానీ ఖర్గేజీ  దృఢమైన నాయకత్వంలో మనం పట్టుదలతో ఉన్నాము. ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం’ అని ఆమె తెలిపారు.
 
విపక్షాల బలాన్ని సోనియా ప్రస్తావిస్తూ, లోక్‌సభలో కాంగ్రెస్ బలగాలు పెద్దగా ఉండటమే కాకుండా, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల బలం కూడా బలపడిందని ఆమె చెప్పారు. అంతకుముందు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ పనితీరు అంచనా కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీ స్థితిని మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఆమె పునరుద్ఘాటించారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ తన పేరు మీద మాత్రమే అధికారాన్ని కోరారని, రాజకీయంగా, నైతికంగా ఓటమి పాలయ్యారని సోనియా స్పష్టం చేశారు. “వాస్తవానికి, ఆయన కోరుకున్న ఫలితాలను పొందలేకపోయారు.  తద్వారా నాయకత్వ హక్కును కూడా కోల్పోయారు. అయినప్పటికీ, వైఫల్యానికి బాధ్యత వహించకుండా, ఆయన రేపు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారు. ఆయన తన పాలన శైలిని మార్చుకుంటారని మనం ఆశించడం లేదు. అయితే పార్లమెంట్ లో ఏకపక్షంగా వ్యవహరించడం ఇప్పుడు సాధ్యం కాదు” అని ఆమె స్పష్టం చేశారు.