25 రోజుల్లో కేసీఆర్, హరీశ్ లను అరెస్ట్ చేయండి

25 రోజుల్లో కేసీఆర్, హరీశ్ లను అరెస్ట్ చేయండి

మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ఓట్లు బిజెపికి బదిలీ కావడం వల్లే తాను గెలిచానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బిజెపి నేత ఎం రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. మెదక్ లో గెలిచేందుకు హరీశ్రావు తనకు మద్దతు ఇచ్చారనే ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ పౌరుషం ఉంటే 25 రోజుల్లో కేసీఆర్, హరీశ్ రావులను అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. సీఎం ప్రియమిత్రుడు హరీశ్ రావును సిద్దిపేటలో ఓడించేది బీజేపీనే అని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో నీళ్ల మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ నేత హరీశ్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రఘనందన్ ప్రశ్నించారు. తనకు హరీశ్ ఓట్లు వేయించారని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలి అని సవాల్ విసిరారు.  సొంత జిల్లాలో ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోలేని సీఎం రేవంత్ రెడ్డి పొంకణాలు కొడుతున్నారని బీజేపీ నేత విమర్శించారు. 

సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో ఓడిపోతే మాట్లాడని రేవంత్ రెడ్డికి మెదక్ గురించి ఎందుకని ప్రశ్నించారు.  పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సమాజానికి తెలుసని విమర్శించారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని స్పష్టం చేశారు.

మల్కాజిగిరి సీటు ఎంతకు అమ్ముకున్నావని సీఎం రేవంత్కు రఘనందన్ సూటి ప్రశ్న వేశారు. మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి డబ్బులు పంచుతుంటే ఎందుకు ఆపలేకపోయావని ఎద్దేవా చేశారు. తాను జై తెలంగాణ అని రోడ్డు ఎక్కినవాడినని, మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. 

నీలం మధు హరీశ్రావు శిష్యుడు కాదా? అన్న రఘనందన్ అతడిని హరీశ్ రావు, రేవంత్ రెడ్డి కలిసి బకరాను చేశారని విమర్శించారు. ఎనిమిది చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బదిలీ అయ్యిందా? అని ప్రశ్నించారు.

“సొంత జిల్లాలో ఎమ్మెల్సీ, ఎంపీలను గెలిపించుకోలేని సీఎం రేవంత్ రెడ్డి పొంకణాలు కొడుతున్నారు. హరీశ్ రావు నాకు మద్దతు ఇచ్చారని తప్పుగా ప్రచారం చేయడం సరికాదు. నేను ఎవరి దయాదాక్షిణ్యాలపై గెలవలేదు. మల్కాజిగిరిలో అభ్యర్థిగా పక్క జిల్లా వారికి ఎందుకు నిలబెట్టారు? సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలో ఓడిపోతే మాట్లాడని రేవంత్ రెడ్డికి మెదక్ గురించి ఎందుకు?” అని ప్రశ్నించారు.