
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతోపాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ను పాటిస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు చేపట్టాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది.
నిత్య కల్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రిలో కూడా భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది.
స్వామి వారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందని, అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనం క్యూలైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆలయంలో జూన్ 1 నుంచి డ్రెస్ కోడ్ నియమాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, ఆలయంలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంచేందుకే ఇలాంటి నియమాలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీశుడి క్షేత్ర మహత్యం తెలిపేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. బోర్డులోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫోన్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్షేత్ర మహత్యం వివరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. జూన్ 1వ నుంచి అమలయ్యే సంప్రదాయ వస్త్రధారణకు భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత