
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది.
పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబం ధించి పెండింగ్ అంశాలన్నింపై తక్షణమే నివేదికలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిల విషయం ఇంకా తేలలేదు. వీటిపై పేచీలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాలపై ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను తెలుసుకున్నారు.
వీటిపై చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ జరిగిన వాటి వివరాలపై కూడా సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. మే 18వ తేదీన శనివారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో కొలిక్కి రాని వివాదాలు, రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు