తిహార్‌ జైలును పేల్చేస్తామని బెదిరింపు

తిహార్‌ జైలును పేల్చేస్తామని బెదిరింపు
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులో పెరిగాయి. ఇదే నెలలో నాలుగుసార్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. పాఠశాలలు, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కి సైతం బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్స్‌ పంపారు. తాజాగా మంగళవారం ఉదయం నగరంలోని నాలుగు హాస్పిటల్‌కు బెదిరింపులు వచ్చాయి. 
 
సాయంత్రం సమయంలో తిహార్‌ జైలును పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు అధికారులకు మెయిల్‌ పంపారు. ఈ మేరకు జైలు అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.
 
దేశంలోనే ప్రముఖ రాజకీయ నాయకులు, హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు, కరుడుగట్టిన నిందితులు ఉన్న తీహార్ జైలుకు తాజాగా బాంబు హెచ్చరికల మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపులకు సంబంధించిన ఈ మెయిల్ వచ్చింది. 
 
ఇదే ఈ మెయిల్ దేశంలోనే ప్రముఖమైన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కూడా పంపించారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలలు, ఆస్పత్రుల్లో కూడా బాంబులు పెట్టినట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ తీహార్ జైలులో ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సహా పలువురు కీలక రాజకీయ నేతలు ఉన్నారు.
 
 అంతేకాకుండా రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ కూడా ఇదే తీహార్ జైలులో ఉండటం గమనార్హం. ఇటీవల మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ తీహార్ జైలులోనే ఉండేవారు.  మరోవంక, మంగళవారం ఉదయం నాలుగు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయిని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. జీటీబీ హాస్పిటల్‌, దాదా దేవ్ హాస్పిటల్, హెడ్గేవార్ హాస్పిటల్, దీప్‌చంద్ర బంధు హాస్పిటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఫైర్‌ సర్వీసు అధికారులు తెలిపారు. 
 
బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అగ్నిమాపక దళం, బాంబు డిటెక్షన్ టీమ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్థానిక పోలీసు బలగాలు.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వస్తువులు ఏమీ గుర్తించలేదని హెడ్గేవార్ ఆసుపత్రి భద్రతా అధికారి వీకే శర్మ చెప్పారు. ఢిల్లీలో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలకు బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి. 
 
మే 12న దాదాపు 20 ఆసుపత్రులకు బెదిరింపులు వచ్చాయి. అదే రోజు ఇందిరాగాంధీ విమానాశ్రయానికి సైతం బాంబు బెదిరింపు ఈమెయిల్‌ వచ్చింది. అయితే, అవన్నీ తప్పని తేలింది. మే 1న ఢిల్లీలోని వంద పాఠశాలలు, నోయిడాలోని రెండు, లక్నోలోని పాఠశాలకు సైతం బెదిరింపులు వచ్చాయి. ఈ అయితే, వ్యవహారంలో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.