ప్రధాని మోదీపై రేవంత్ అనుచిత వాఖ్యలు … ఈటెల ఆగ్రహం

ప్రధాని మోదీపై రేవంత్ అనుచిత వాఖ్యలు … ఈటెల ఆగ్రహం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఊసరవెల్లి మాటాలు మాట్లాడుతున్నారని, మొదటిసారి వచ్చినప్పుడు ప్రధాని మోదీని మాపెద్దన్న అని ప్రస్తుతం మోదీ  గిడి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతూ సిఎం రేవంత్ నువ్వు చిన్న మనిషివి, అధికారం మీ అమ్మ నాన్న ఇచ్చింది కాదని గ్రహించాలని హితవు చెప్పారు. 

బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌ను ఓడగొట్టడానికి ప్రజలు ఇచ్చిందని పేర్కొంటూ ప్రధాని మోదీని విమర్శించిన వారు ఏమైపోయారో చూశామని, నీకు అదే గతిపడుతుందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన చిన్న ఎన్నికలు అని కాంగ్రెస్‌కు వేశామని, ఇప్పుడు పెద్ద ఎన్నికలు మోదీకే వేస్తాం అంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు ఉందో లేదో యువత చెక్ చేసుకోవాలని, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 

సుస్థిర, సుసంపన్న, శాంతియుత పాలన కావాలంటే మోదీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ సీటు ఇస్తా అంటే వద్దు అని పారిపోతున్నారని, బిఆర్‌ఎస్ మొన్నటి వరకు అన్నింటిలో నంబర్ వన్ అని చెప్పుకున్నారని, కానీ ఇప్పుడు పోటీ చేయడానికి నాయకులు దిక్కులేరని ఎద్దేవా చేశారు. ఇటీవల గెలిచిన నాయకులంతా వరుసగా జారిపోతున్నారని చెబుతూ మూడోసారి బిజెపికి అధికారం ఇవ్వాలని కోరారు. 

తెలంగాణ ఉద్యమకారులు, తనతో పాటు టిఆర్‌ఎస్‌లో పనిచేసిన నాయకులు తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బిజెపికి ఓటు వేయాలని ఈటెల కోరారు. కాంగ్రెస్ పుట్టిన యూపీలోనే నీకు అడ్రస్ లేక వేరే సీట్లో గెలిచారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేస్తే దేనికంటే దానికి సిద్దమని సవాల్ విసిరారు. మల్కాజిగిరి నరేంద్రమోదీ గుండెల్లో పెట్టుకున్న నియోజకవర్గమని చెప్పారు. 

 ఈ ప్రజల ప్రేమకు ముగ్ధులు అయిన్నట్లు  నాగర్ కర్నూల్, జగిత్యాలలో ప్రధాని చెప్పారని చెబుతూ ప్రజలు చూపినఈ ప్రేమతో తన జీవితం దైన్యం అయ్యిందని తెలిపారు. బిజెపి గెలిచే 400 స్థానాల్లో మల్కాజిగిరి కూడా ఒకటి ఉండబోతుందని భరోసా వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే మల్కాజిగిరి మోదీ  రోడ్ షో విజయవంతమైందని చెప్పారు.

కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపుల నిలబడి స్వాగతం పలికారని, తెలంగాణ గడ్డ మీద ప్రజల సంఘీభావం మోదీ  మదిలో చిరస్థాయిగా నిలచిపోయిందని పేర్కొన్నారు. కేవలం ఉత్తర భారత దేశంలోనే కాకుండా దక్షిణాదిన కూడా మోదీ  ప్రభంజనం బలంగా ఉంది అని నిరూపించారని కొనియాడారు. ఈసారి మాకు పార్టీ జెండా సిద్ధాంతం సంబంధంలేదు మావోటు మోదీ, ఈటల రాజేందర్‌కే అని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు.

ప్రపంచదేశాలు కూడా మళ్ళీ మోదీ  ప్రధాని అవుతారని నమ్ముతున్నారని చెబుతూ  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధాని మన నరేంద్ర మోదీయే అని స్పష్టం చేశారు. ఆయన హయాంలో 12 కోట్ల మరుగుదొడ్డు నిర్మించారని తెలిపారు.  పుల్వామా దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేసి బదులు తీర్చుకున్నారని గుర్తు చేశారు. ప్రజలు డబ్బు, మద్యంకు పాతర వేసి, ధర్మాన్ని గెలిపించాలని కోరారు