భారతీయ సిబ్బందితో వెళ్తోన్న వాణిజ్య నౌకపై క్షిపణి దాడి

భారతీయ సిబ్బందితో వెళ్తోన్న వాణిజ్య నౌకపై క్షిపణి దాడి
* రంగంలోకి ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌక
 
క్షిపణి దాడికి గురైన ట్యాంకర్‌ షిప్‌లో మంటలు చెలరేగడంతో భారతీయ సిబ్బంది ఉన్న ఆ నౌక సహాయం కోరగా భారతీయ నావికాదళం వెంటనే స్పందించింది. బ్రిటిష్ చమురు ట్యాంకర్ ఎంవీ మార్లిన్ లువాండా అత్యవసర ఎస్‌ఓఎస్‌ సందేశం పంపింది.  వేంటనే సహాయం, రెస్క్యూ కోసం భారత నావికాదళానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌకను ఆ షిప్‌ వద్దకు పంపింది. 
నౌకా బృందాలు మంటలను ఆర్పేందుకు, అందులోని సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని నావికాదళం తెలిపింది. జనవరి 26 రాత్రి గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో బ్రిటిష్ చమురు ట్యాంకర్ ఎంవీ మార్లిన్ లువాండాపై హౌతీలు క్షిపణులతో దాడి చేశారు.  దీంతో ఆ ట్యాంకర్‌ షిప్‌లో మంటలు చెలరేగాయి. అందులో 22 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్ సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నార

‘భారత నావికాదళం దృఢంగా ఉంది. వాణిజ్య నౌకల రక్షణ, సముద్రంలో జీవిత భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉంది’ అని నౌకాదళం ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయేల్- హమాస్ యుద్ధం కొనసాగుతుండగా ఎర్ర సముద్రంలో వ్యాపార నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నాయి. దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతోన్న వేళ తాజా క్షిపణి దాడి చోటుచేసుకుంది. 
 
సముద్రంలో జరిగే ఇలాంటి సంఘటనలను పటిష్టంగా ఎదుర్కోవాలని అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 18న భారతీయ క్రూ సిబ్బందితో కూడిన వాణిజ్య నౌక గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో డ్రోన్‌ల ద్వారా దాడికి గురైంది.  ఎమర్జెన్సీ కాల్ అందుకున్న తర్వాత దానికి సాయంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను భారత్ మోహరించింది. 21 మంది భారతీయ సిబ్బందితో లైబీరియన్ జెండాతో కూడిన ఎంవి కెమ్ ప్లూటో డిసెంబర్ 23న గుజరాత్ తీరంలో డ్రోన్ దాడికి గురి అయింది.

ఎంవి  కెమ్ ప్లూటోతో పాటు భారతదేశానికి వెళుతున్న మరో వాణిజ్య చమురు ట్యాంకర్ అదే రోజు దక్షిణ ఎర్ర సముద్రంలో అనుమానాస్పద డ్రోన్ దాడికి గురైంది. ఈ నౌకలో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇక, ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణిని అమెరికా- బ్రిటన్ దళాలు గురువారం కూల్చివేసిన విషయం తెలిసిందే.