
చైనాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సుమారు 116 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడనట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
చైనాలోని వాయువ్య ప్రాంతమైన గన్సుకి పది కిలోమీటర్ల లోతులో 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు చైనా భూకంప నెట్వర్క్ కేంద్రం తెలిపింది. చైనా రాజధాని బీజింగ్కు నైరుతి దిశలో 1,300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం పేర్కొంది. అర్ధరాత్రి తర్వాత మంగళవారం ఉదయం పది గంటల సమయంలో వరుస ప్రకంపనలు వచ్చాయని తెలిపింది.
భూకంపం ధాటికి గన్సు, క్వింఘై ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు మీడియా పేర్కొంది. భూకంప తీవ్రత 5.9గా రికార్డయినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భవనాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నీరు, విద్యుత్ మరియు కమ్యూనికేషన్ లైన్లు ధ్వంసమైనట్లు తెలిపింది. గన్సులో 105 మంది మరణించగా, మరో 397 మంది గాయపడ్డారని, వీరిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉందని ప్రావిన్షియల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ విభాగం ప్రతినిధి హాన్ షుజన్ ఓ ప్రకటనలో తెలిపారు.
క్వింఘై ప్రావిన్స్లో 11 మంది మరణించగా, సుమారు 140 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు. తక్షణ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, గాయపడినవారికి తక్షణమే చికిత్స అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
భూకంపం ప్రభావంతో సంభవించే మార్పుల వల్ల పరిస్థితులు దిగజారకుండా చూడాలని కోరారు. కాగా, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 15 నుండి మైనస్ 9 డిగ్రీలకు పడిపోయినట్లు చైనా వాతావరణ యంత్రాంగం తెలిపింది. సహాయక చర్యల్లో భాగంగా 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, పోలీసులను పంపారు.
ఆ ప్రాంతంలో కమాండ్ పోస్టను ఏర్పాటు చేసినట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్లో చైనాలోని నైరుతి ప్రావిన్స్ సిచువాన్లో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 74 మంది మరణించారు.
More Stories
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’