ధన త్రయోదశికి రూ 50 వేల కోట్లకు పైగా వ్యాపారం

ధన త్రయోదశికి రూ 50 వేల కోట్లకు పైగా వ్యాపారం

ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో బంగారం, వెండితో పాటు వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు భారీగా సాగాయి. ధన్‌తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్‌లో రూ.50వేలకోట్లకుపైగా వ్యాపారం సాగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిఎఐటి) పేర్కొంది. ఇందులో ఒక ఢిల్లీలోనే రూ.5వేల కోట్ల విలువైన కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. 

గతేడాది ధన త్రయోదశి సమయంలో రూ.35 వేల కోట్ల వ్యాపారం జరగ్గా, ఈ సారి భారీగా పెరిగింది. ఈ సందర్భంగా సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ధన త్రయోదశి పండుగ సమయంలో  గతేడాదితో పోలిస్తే 43 శాతం ఎక్కువగా అమ్మకాలు జరిగాయని తెలిపారు. 

ధన్‌తేరస్‌లో జరిగిన విక్రయాల్లో వాహనాల వాటా రూ.5వేలకోట్లు. అలాగే రూ.3వేల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అమ్మకాలు జరగ్గా, రూ.300 కోట్ల విలువైన పూజా సామగ్రి కొనుగోళ్లు జరిగాయి. అలాగే లక్ష్మీమాత, గణేశుడి విగ్రహాలు, మట్టి దీపాలు, అలంకరణ వస్తువులు, చీపుర్ల విక్రయాలు గతేడాది కంటే మెరుగ్గా సాగాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు గతేడాది కంటే 15 నుంచి 20 శాతం ఎక్కువ. 

బంగారం ధరలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ దినేష్ జైన్ తెలిపారు. ఇటీవల ధరలు తగ్గడంతో వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వస్తోందని చెప్పారు. వజ్రాల ధరలు తగ్గుముఖం పట్టడంతో యువత నుంచి ఎక్కువగా లైట్ వెయిట్ జ్యువెలరీకి డిమాండ్ చెప్పారు. 

ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల చిన్న, పెద్ద ఆభరణాల వ్యాపారులున్నారన్నారు. ధన్‌తేరస్‌లో 41 టన్నుల బంగారం, 400 టన్నుల వెండి ఆభరణాలు, నాణేలు అమ్ముడయ్యాయని వివరించారు.

ధన్‌తేరస్‌లో విక్రయించిన మొత్తం 42 టన్నుల బంగారంలో దక్షిణ భారతదేశం వాటా 60- 65 శాతం ఉంటుందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సురేంద్ర మెహతా తెలిపారు. పశ్చిమ భారతంలో 20- 25 శాతం వాటా బంగారం విక్రయాలు జరిగాయని, ఉత్తర భారతంలో 10-12 శాతం, తూర్పు భారతంలో 5 శాతం వాటా విక్రయాలు జరిగాయని వివరించారు.