107 పతకాలతో ఆసియా క్రీడలలో భారత్ సరికొత్త చరిత్ర

107 పతకాలతో ఆసియా క్రీడలలో భారత్ సరికొత్త చరిత్ర
ఆసియా క్రీడలలో భారత్‌ కొత్త చరిత్రకు నాంది పలికింది. గత రికార్డులను తిరుగరాస్తూ నయా శకానికి బాటలు వేసింది. స్పోర్ట్స్‌ పవర్‌హౌజ్‌లుగా వెలుగొందుతున్న చైనా, కొరియా, జపాన్‌లకు దీటైన సవాల్‌ విసురుతూ ఆసియాడ్‌లో భారత్‌ దిగ్విజయంగా పతకాల వేట కొనసాగించింది. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన మెగాటోర్నీలో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

పదిహేను రోజుల పాటు అభిమానులను అలరించిన టోర్నీలో పోటీలకు ఆఖరి రోజైన శనివారం భారత్‌ 6 స్వర్ణాలు సహా నాలుగు రజతాలు, 2 కాంస్యాలతో 12 పతకాలు కొల్లగొట్టింది. ‘ఇస్‌ బార్‌ సౌ పార్‌’ నినాదాన్ని బాగా ఒంటపట్టించుకున్న మనోళ్లు జాతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు.  వచ్చే ఏడాది జరిగే పారిస్‌(2024) ఒలింపిక్స్‌కు ముందు మెండైన ఆత్మవిశ్వాసం సొంతం చేసుకున్నారు. హాంగ్జౌ ఆసియాడ్‌లో అథ్లెట్లు 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిస్, 22 పతకాలతో షూటర్లు తమ గురికి తిరుగులేదని చాటిచెప్పారు. మొత్తంగా 107 పతకాలతో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

ఈసారి ఆసియాడ్‌లో భారత్‌ ఆర్చర్లు తమ అద్భుత గురితో పతకాలు కొల్లగొట్టారు. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి సురేఖ 149-145తో సో చీవాన్‌(కొరియా)పై అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో జ్యోతికి ఇది మూడో స్వర్ణం. మరోవైపు అదితి గోపీచంద్‌ కాంస్యాన్ని ముద్దాడింది.  పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత ఫైనల్లో భారత ఆర్చర్లు ఓజాస్‌ ప్రవీణ్‌ పసిడి దక్కించుకోగా, అభిషేక్‌వర్మ రజతం ఖాతాలో వేసుకున్నాడు.

శనివారం అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వడంతో మెరుగైన ర్యాంక్‌ ఉన్న టీమ్‌ఇండియాను అంపైర్లు విజేతగా ప్రకటించారు. దాంతో రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన స్వర్ణం పతకంతో సంబురాలు చేసుకుంది. చదరంగంలో భారత పురుషుల, మహిళల గ్రాండ్‌మాస్టర్ల బృందం రజత పతకం చేజిక్కించుకుంది. వరల్డ్‌ నంబర్‌ 1 ప్రజ్ఞానంద, గుకేశ్‌, విదిత్‌ గుజరాతీ, పెండ్యాల హరికృష్ణ, అర్జున్‌ ఎరిగైసీలతో కూడిన పురుషుల జట్టు 9, 10వ రౌండ్‌లో ఫిలీప్పీన్స్‌ను 3.5-0.5తో చిత్తు చేసింది.

మహిళల విభాగంలో గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక అగర్వాల్‌, సవితా శ్రీలతో కూడిన బృందం దక్షిణా కొరియాపై 4-0తో గెలుపొందింది. రెజ్లింగ్‌లో ఆఖరి రోజు కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనుకున్న దీపక్‌ పూనియా నిరాశపరిచాడు. 24 ఏళ్ల సంచలనం దీపక్‌ 86 కిలోల విభాగంలో రజతంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది.

పురుషుల కబడ్డీ ఫైనల్లో భారత్‌ 33-29 తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇరాన్‌ను మట్టికరిపించింది. మరోవైపు నువ్వానేనా అన్నట్లు సాగిన మహిళల పోరులో భారత్‌ 26-25తో చైనీస్‌ తైపీ గెలిచిపై మూడోసారి పసిడి దక్కించుకుంది.