చమురు చేప సార్డిన్ జన్యు పరీక్ష జరిపిన శాస్త్రవేత్తలు

చమురు చేప సార్డిన్ జన్యు పరీక్ష జరిపిన శాస్త్రవేత్తలు

భారత దేశ చమురు చేపగా ప్రసిద్ధి చెందిన సార్డిన్ (కవలు) లోని మొత్తం జన్యువును ఐసిఎఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సిఎంఎఫ్‌ఆర్‌ఐ)కు చెందిన శాస్త్రవేత్తల బృందం విశ్లేషించ గలిగింది. భారత ఉపఖండంలో సముద్ర చేపల తెగల్లో జన్యు విశ్లేషణ చేయడం ఇదే మొదటిసారి. 

సార్డిన్ చేప జీవావరణం, పరిణామం అర్ధం చేసుకోడానికి ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని, భారత దేశ సముద్ర మత్స పరిశోధనలో ఇదో మైలురాయి వంటిదని సిఎంఎఫ్‌ఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ఎ. గోపాలక్రిష్ణన్ అభివర్ణించారు. ఈ చేపను సంరక్షించడానికి, సుస్థిర వినియోగానికి యాజమాన్య నిర్వహణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి వీటి సంక్లిష్ట జన్యుడేటా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇది మొత్తం 46,316 ప్రొటీన్ కోడింగ్ జన్యువులను కలిగి ఉంటుంది. అత్యాధునిక తదుపరితరం సీక్వెన్సింగ్ సాంకేతికతతో పరిశోధకులు ఈ జన్యు రహస్యాలను కనుగొనగలిగారు. సిఎంఎఫ్‌ఆర్‌ఐ మెరైన్ బయోలజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా సుకుమారన్ ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించారు. జర్నల్ సైంటిఫిక్ డేటా ఆఫ్ ది నేచర్ గ్రూప్‌లో ఈ పరిశోధన వెలువడింది. 

భారత ఉపఖండంలో మొత్తం సముద్ర మత్స సంపదలో 10 శాతం సార్డిన్ చేపలే ఉంటాయి. సరిహద్దు మత్స సంపదగా చెప్పుకునే ఈ నిగూఢమైన సార్డిన్ చేపల్లో మొత్తం జన్యు సమాచారం ఈ చేపల ఉనికిని ధృవీకరించడానికి, చాటుమాటుగా సాగే వాణిజ్యాన్ని కనిపెట్టడానికి ఉపయోగపడుతుందని డాక్టర్ గోపాలక్రిష్ణన్ పేర్కొన్నారు. 

హిందూ మహాసముద్రంలో వాతావరణం, చేపల వేటవల్ల వచ్చే పరిణామాలు తెలుసుకోవడానికి సార్డిన్ చేపలు నమూనా ప్రాణులుగా గుర్తించవచ్చని చెప్పారు. పర్యావరణంలోని వైవిధ్యాలకు, సముద్ర శాస్త్ర ప్రమాణాలకు ఇవి వేగంగా స్పందిస్తాయని తెలిపారు. వాతావరణ మార్పులకు ఈ చేప ఎలా అన్వయించుకుని జీవిస్తుందో అధ్యయనం చేయడానికి వీటి జన్యు క్రమబద్ధీకరణ ఒక సాధనంగా చెప్పారు.

ఈ సార్డిన్ చేపలు కొన్ని భారత సముద్ర జలాల్లోనూ , మరికొన్ని ఒమన్ గల్ఫ్ సముద్ర జలాల్లో జీవిస్తుంటాయని తెలిపారు. వీటిలో జన్యుపరమైన తేడాలు అర్థం చేసుకోవడం ద్వారా ఉత్తర హిందూ మహాసముద్రంలో పర్యావరణ, సముద్ర వాతావరణ పరిస్థితులు వీటిపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుస్తుందని వివరించారు. 

ఈ చమురు చేపలో నిక్షిప్తమై ఉన్న బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (పోలీ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్)లోని జన్యువులు కూడా జన్యువ్యవస్థలపై అంతర్ దృష్టులను అందిస్తాయని గుర్తించారు. కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఈ చేపల్లో లభిస్తాయి. మనిషి ఆరోగ్యానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. కొత్త ఆహార పదార్థాలను, బలవర్థకమైన ఆహారాలను కనుగొనడానికి కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు.