
చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాలతో పాటు ప్రతి గ్రహంపైకి వెళ్లే సత్తా భారత్కు ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిశోధనలకు మరిన్ని పెట్టుబడులు అవసరమని ఆయన తెలిపారు. చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో ప్రణాళికల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్కు జాబిల్లితో పాటు మార్స్, వీనస్ గ్రహాలపైకి వెళ్లి పరిశోధనలు చేసే సామర్ధ్యం ఉందని, అందుకు కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం పెంచుకోవడమేనని పేర్కొన్నారు.
‘భారత్కు జాబిల్లితోపాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లి పరిశోధనలు చేసే సామర్ధ్యం ఉంది. అందుకు మన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలి. వీటితో పాటు అంతరిక్ష ప్రయోగాలకు పెట్టుబడులు కూడా అవసరం. దానివల్ల అంతరిక్ష పరిశోధనా రంగం సహా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదే మా లక్ష్యం’ అని సోమనాథ్ స్పష్టం చేశారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంకావడంతో సోమనాథ్ కేరళకు వెళ్లి తిరువనంతపురంలోని పౌర్ణమికావు భద్రకాళి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి అనే పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు.
శివశక్తి, తిరంగా (చంద్రయాన్- 2 క్రాష్ల్యాండ్ అయిన ప్రాంతానికి పెట్టిన పేరు) రెండు పేర్లు భారతీయతకు చిహ్నమని తెలిపారు. జీవితంలో సైన్స్, ఆధ్యాత్మికత ఈ రెండు అంశాలపట్ల తనకు ఆసక్తి ఉందని పేర్కొన్నారు. అందుకే వివిధ ఆలయాలను దర్శించడంతోపాటు అనేక గ్రంథాలను చదివి విశ్వంలో మనిషి మనుగడకు ఉన్న నిజమైన అర్థాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంటూ వాటి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని తెలిపారు. చంద్రయాన్-3 బోర్డులో ఏర్పాటు చేసిన ఐదు పరికరాలు డేటాను అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వివిధ మోడల్లలో రెండింటి పనితీరును పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టగలమని సోమనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!