
సామాజిక మాధ్యమాల్లో చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు, అత్యాచార వీడియోల వ్యాప్తిని నియంత్రించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను సుప్రీం కోర్టు మూసివేసింది. ఈ అంశంలో సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం వీడియోల వ్యాప్తి కట్టడి చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్టు గుర్తించింది.
ఈ క్రమం లోనే ఈ కేసులో విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది. వాట్సప్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ఛైల్డ్ పోర్నోగ్రఫీ, అత్యాచార ఘటనల వీడియోలు విచ్చల విడిగా వ్యాప్తి చెందుతుండటంపై “ప్రజ్వల” అనే స్వచ్ఛంద సంస్థ 2015 లో అప్పటి సీజేఐ హెచ్ఎల్ దత్తుకు లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా పిల్ దాఖలు చేసి విచారణ చేపట్టింది.
ఈ క్రమంలోనే వీడియోల వ్యాప్తిని కట్టడిచేసేలా తగిన చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చర్యలను ఎప్పటికప్పుడు న్యాయస్థానం పరిశీలించింది. ఈ కమిటీలో ఫేస్బుక్, వాట్సప్ సహా సామాజిక మాధ్యమాల ప్రతినిధులు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం డైరెక్టర్ జనరల్, సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ ఇటీవల తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. దీన్ని పరిశీలించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్తో కూడిన డివిజన్ బెంచ్, ఈ విస్తృతమైన అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిపింది. వీడియోల వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో గణనీయమైన పురోగతి ఉందని పేర్కొంది.
ఇక చర్యల అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను మాత్రమే పరిశీలించాల్సి ఉందని, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించింది. ఇక ఈ అంశాన్ని కోర్టు పరిశీలించిన అవసరం లేదని పేర్కొన్న ధర్మాసనం, పిల్ విచారణను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఒకవేళ చర్యల అమలు తర్వాత కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు